బెంగళూరు జైల్లో జయలలిత నెచ్చలి వీకే శశికళకు అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స!
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వీకే. శశికళ ఆగస్టు 31వ తేదీ శుక్రవారం అనారోగ్యానికి గురైనారని వెలుగు చూసింది.
శుక్రవారం సాయంత్రం కన్నడ మీడియాలో శశికళ అనారోగ్యానికి గురైనారని వార్తలు ప్రసారం అయ్యాయి. రక్తపోటు, మధుమేహ వ్యాదితో అస్వస్థతకు గురైన వీకే. శశికళకు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఆవరణంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని సమాచారం.
కొంత కాలం క్రితం వీకే. శశికళ అనారోగ్యానికి గురి కావడంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఆసుపత్రిలో చికిత్స చేశారు. శశికళ త్వరగా కోలుకోకుంటే వేరే ఆసుపత్రికి ఆమెను తరలించడానికి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి వీకే. శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో జైలులో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని మహిళ ఐపీఎస్ అధికారి రూపా కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడంతో శశికళ వార్తల్లో నిలిచారు.