అవినీతిపరుల భరతం పట్టిన తెలుగు కలెక్టర్ చంద్రకళ ఇంట్లో సీబీఐ దాడులు
ఉత్తర్ ప్రదేశ్లో మైనింగ్ శాఖ అధికారులపై సీబీఐ దాడులకు దిగింది. మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఉత్తర్ ప్రదేశ్లోని 12 చోట్ల ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. యూపీతో పాటు ఢిల్లీలో కూడా పలువురి అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది సీబీఐ.
తెలుగు కలెక్టర్ చంద్రకళ ఇంట్లో సీబీఐ సోదాలు
ఢిల్లీ, లక్నో, కాన్పూర్, హమీర్పూర్, జలాన్లలో సోదాలు నిర్వహించింది సీబీఐ. పలువురి అధికారుల నివాసాలపై దాడులు నిర్వహించిన సీబీఐ ఐఏఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై కూడా సోదాలు చేసింది. కలెక్టర్ చంద్రకళ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన అధికారిణి. అవినీతి ఆరోపణలు ఉన్నవారిపై కఠినంగా వ్యవహరిస్తారనే పేరు చంద్రకళకు ఉంది. 2008 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన చంద్రకళ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్కు చెందిన అధికారిణి.
నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారని ఆరోపణలు
కొన్ని నెలల క్రితం బులంద్ షహర్ నడిరోడ్డుపై చంద్రకళ నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు దేశానికి ఉంటే దేశంలో అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని పలువురు నెటిజెన్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే చంద్ర కళ ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి మైనింగ్ స్కాముకు సంబంధించి పలు ముఖ్య డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. 2012లో హమీర్పూర్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా శాండ్ మైనింగ్కు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు చంద్రకళ పై వచ్చాయి.
అలహాబాదు హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ
ఇదిలా ఉంటే మైనింగ్లో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఐదు జిల్లాల్లో విచారణ చేపడుతోంది. ఇందులో షమ్లీ, హమీర్పూర్, ఫతేపూర్, సిద్ధార్థ్ నగర్, దియోరియా జిల్లాల్లో విచారణ చేపడుతోంది. జూలై 2017లో అలహాబాదు హైకోర్టు మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆదేశాల మేరకు అధికారులు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అక్రమ మైనింగ్కు ప్రభుత్వంలోని అధికారుల అండదండలు ఉన్నాయంటూ అలహాబాదు హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇది నాణేనికి ఒక వైపు ఉండగా మరో వైపు అక్రమ మైనింగ్పై గొంతెత్తిన ప్రభుత్వ అధికారులు హత్యకు గురవడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది.