నేనూ ఇంజనీర్నే... బలవంతం సరికాదు... 'నీట్,జేఈఈ'లపై స్టూడెంట్స్కు సోనూ భాయ్ సపోర్ట్...
నీట్(NEET),జేఈఈ(JEE) పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓవైపు విద్యార్థుల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత... మరోవైపు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించి తీరుతామన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటనలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో పేదలకు ఆపన్నహస్తం అందిస్తూ రియల్ హీరోగా జనం చేత జేజేలు అందుకుంటున్న నటుడు సోనూ సూద్ ఈ అంశంపై స్పందించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలు రాయమని బలవంతపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.
నీట్,జేఈఈ ఫిక్స్... సుబ్రహ్మణ్యస్వామి బిగ్ ట్విస్ట్... 'ఆత్మహత్యల'పై హెచ్చరిక...
బలవంతపెట్టడం సరికాదు... : సోనూ సూద్...
నీట్,జేఈఈ పరీక్షలను వ్యతిరేకిస్తున్న 26లక్షల మంది విద్యార్థులకు ఇప్పుడు మనం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. మరో రెండు లేదా మూడు నెలల సమయమిచ్చి... విద్యార్థులు మానసికంగా సిద్దమైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అన్నారు. 'బిహార్ నుంచి ఈ పరీక్షలకు హాజరయ్యేవారిలో ఎక్కువమంది ఇటీవల వరదలకు అతలాకుతలమైన 13-14 జిల్లాల నుంచే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు పరీక్షలు రాసేందుకు వస్తారని మీరెలా అనుకోగలరు. రావడానికి డబ్బు లేదు,వేరే చోట ఉండేందుకు వారికేమి ప్రత్యేక సదుపాయాలు లేవు. కాబట్టి పరీక్షలు రాయాల్సిందేనని వాళ్లను బలవంతపెట్టడం సరికాదు.' అని సోనూ సూద్ అభిప్రాయపడ్డారు.
నేనూ ఓ ఇంజనీర్నే అన్న సోనూ
'నేను కూడా ఓ ఇంజనీర్నే. ఇప్పుడీ పరీక్షలకు హాజరయ్యే కొత్త తరం దేశానికి ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి మరో 2 లేదా 3 నెలల సమయం ఇవ్వాలి. పరీక్షలను నవంబర్-డిసెంబర్కు వాయిదా వేయాలి. విద్యార్థులు మానసికంగా సిద్దమయ్యాకే పరీక్షలు నిర్వహించాలి.' అని సోనూ సూద్ చెప్పుకొచ్చారు. అంతకుముందు ట్విట్టర్లోనూ నీట్,జేఈఈ పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా కేంద్రానికి సోనూ సూద్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల జీవితాలను రిస్క్లో పెట్టవద్దని కోరారు.
విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత...
నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ గురువారం(అగస్టు 26) దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ ఇళ్ల వద్ద నిరసనలకు దిగనున్నారు. నలుపు రంగు మాస్కులు,నల్ల జెండాలతో నిరసన తెలపనున్నారు. అటు పలువురు రాజకీయ నాయకులు కూడా పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు. కోవిడ్ 19తో పాటు బిహార్,అసోం,గుజరాత్,ఛత్తీస్గఢ్,కేరళ,కర్ణాటక తదితర రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సరికాదని అంటున్నారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సైతం పరీక్షలను వాయిదా వేయాలని ఇదివరకే ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. లేనిపక్షంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పున:సమీక్షిస్తారా...?
ఓవైపు విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తున్నా... నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి తీరుతామని మంగళవారం(అగస్టు 25) ఓ ప్రకటన విడుదల చేసింది. నీట్ పరీక్షను సెప్టెంబర్ 13న,జేఈఈ పరీక్షను సెప్టెంబర్ 1-6 తేదీల్లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పరీక్షలను వాయిదా వేయాలన్న పిటిషన్ను అంతకుముందు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులు,రాజకీయ నాయకుల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణను ప్రభుత్వం పున:సమీక్షించే అవకాశం లేకపోలేదు.