జంట పేలుళ్లకు బాంబులు తయారు చేసింది నేనే: అక్తర్
న్యూఢిల్లీ: నిరుడు ఫిబ్రవరి 21న హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో జరిగిన పేలుళ్లకు బాంబులు తయారు చేసింది తానేనని ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ సన్నిహితుడైన అసదుల్లా అఖ్తర్ వెల్లడించాడు. ఈ మేరకు గత అక్టోబర్లో మేజిస్ట్రేట్ సమక్షంలో అతడు వాంగ్మూలం ఇచ్చాడు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో 16 మంది మృత్యువాత పడగా, మరో 100 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
కాగా నాడు బాంబులను తయారు చేసి, వాటిని ఎలా పేల్చాలన్న విషయంలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులకు మార్గదర్శనం చేశానని అసదుల్లా అక్తర్ తెలిపాడు. ఈ మేరకు గత అక్టోబర్లో మేజిస్ట్రేట్ వాంగ్మూలమిచ్చాడు. దీన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఢిల్లీ కోర్టులో దాఖలు చేసింది. యాసిన్తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రంతో ఈ వాంగ్మూలాన్ని జతచేసింది.
వాంగ్మూలంలో అసదుల్ల అక్తర్ వెల్లడించిన వివరాల ప్రకారం... ‘ప్రస్తుతం పాకిస్థాన్లో తలదాచుకున్న ఐఎం సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ (యాసిన్ భత్కల్ సోదరుడు)తో 2012 డిసెంబర్లో చాటింగ్లో పాల్గొన్నాను. ఆ సందర్భంగా హైదరాబాద్లో ఏదో ఒక సంచలనం సృష్టించాలని నిర్ణయించుకున్నాం. అదే నెలలో హవాలా ద్వారా రియాజ్ నుంచి వచ్చిన డబ్బును బెంగళూరులో అందుకున్నాం' అని తెలిపాడు.
‘ఆ తర్వాత 2013 జనవరిలో రియాజ్ నుంచి ఐఈడి బాంబులు అందడంతో ఫిబ్రవరి 18న రెక్కీ నిర్వహించి, మూడుచోట్ల బాంబులు పెట్టాలని నిర్ణయించుకున్నాం. కానీ, బాంబులు రెండే ఉండటంతో మోను, వకాస్లతో (ఐఎం సభ్యులు)తో ఏ1 మిర్చి సెంటర్, బస్టాండ్లలో పెట్టించాను. ఆ సమయంలో నేనూ వారితోనే ఉన్నా. పేలుళ్ల తర్వాత మేం ముగ్గురం బెంగళూరుకు వెళ్లగా, నేను మాత్రం అక్కడినుంచి నేపాల్ వెళ్లి, అక్కడే ఉన్న యాసిన్ భత్కల్ను కలిశానను' అని అసదుల్లా పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో నిరుడు ఆగస్టు 28న వీరిద్దరినీ ఎన్ఐఏ బృందం నేపాల్ సరిహద్దులో పట్టుకుంది. హైదరాబాద్ పేలుళ్ల కంటే ముందు వారణాసిలో 2006లో ప్రెషర్ కుక్కర్ బాంబులు పెట్టానని, ఐఎం సభ్యుడు అమీన్ కాల్చివేతకు నిరసనగా ఢిల్లీలో 2008 సెప్టెంబర్ 13న, జామా మసీదువద్ద 2010 సెప్టెంబర్ 19న వరుస పేలుళ్లకు పాల్పడ్డానని అసదుల్ల అక్తర్ వివరించాడు.