దాడి చేస్తాం, దమ్ముంటే అడ్డుకో: ముంబై సీపీకి బెదిరింపు
ముంబై: ముంబై పైన దాడులు చేస్తామని, దమ్ముంటే అడ్డుకోవాలని ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పేరుతో ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. గాజాలో దాడులకు ప్రతీకారంగా దాడులకు దిగుతామని తనకు అందిన లేఖలో ఉన్నట్లు కమిషనర్ చెప్పారు.
దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగర వ్యాప్తంగా బందోబస్తును కట్టుదిట్టం చేసింది. ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఉగ్రవాద నిరోదక శాఖ కూడా హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 25వ తేదీన రాత్రి ఒక పేజీతో కూడిన బెదిరింపు లేఖ పోలీసు కమిషనర్కు అందింది.
ఈ లేఖలో హిందీ, ఇంగ్లీషు భాషలలో ఉంది. "ముంబై పైన దాడులు చేస్తాం. 1993లో నిన్ను టార్గెట్ చేశాం. ఇప్పుడు సవాల్ చేస్తున్నాం. దమ్ముంటే దాడులు, పేలుళ్లు జరగకుండా అడ్డుకొని చూపు" అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ లేఖపై 'ముజాహిదిన్' అని ఉంది. ఈ లేఖను ఉత్తుత్తి బెదిరింపుగానే అనుమానిస్తున్నారు. అయితే, ముందుజాగ్రత్త చర్యగా ఉగ్రవాద వ్యతిరేక దళాలను అప్రమత్తం చేశారు. 1993లో ముంబయిలో జరిగిన వరుస పేలుళ్ళ దాటికి 257 మంది మరణించారు.