రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం: దుబాయ్ పారిపోయే ముందు 38 కేజీల బంగారం, సీబీఐ చేతికి !
బెంగళూరు: రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం జ్యువెలర్స్ కేసులో విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) అధికారులు నిందితుడు మన్సూర్ ఆలీ ఖాన్ కు చెందిన విలువైన సమాచారం సేకరించారు. మన్సూర్ ఆలీ ఖాన్ దేశం విడిచి దుబాయ్ కి పారిపోయే ముందు అతని స్నేహితుడికి రూ. 9 కోట్లు ఇచ్చాడని ఎస్ఐటీ అధికారులు గుర్తించారు.
ఐఎంఏ జ్యూవెలర్స్ యజమాని మన్సూర్ ఆలీ ఖాన్ దుబాయ్ పారిపోయే ముందు 38 కేజీల బంగారం కరిగించారు. తరువాత మన్సూర్ ఆలీ ఖాన్ ఆ బంగారం విక్రయించగా వచ్చిన రూ. 9 కోట్లను స్నేహితుడు అబ్బాస్ కు ఇచ్చాడని ఎస్ఐటీ అధికారులు గుర్తించారు. అబ్బాస్ ప్రస్తుతం దుబాయ్ లో నివాసం ఉంటున్నాడు.
బంగారు బిస్కెట్లు కరిగించి విక్రయించగా వచ్చిన సొమ్ముతో మన్సూర్ ఆలీ ఖాన్ పెట్టుబడులు పెట్టాడని అనుమానంతో ఎస్ఐటీ అధికారులు దర్యాప్తు చెయ్యగా ఈ విషయం బయటపడింది. ఐఎంఏ కేసులో విచారణకు హాజరుకావాలని దుబాయ్ లో ఉన్న అబ్బాస్ కు ఎస్ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
సీబీఐ విచారణకు హాజరు
కర్ణాటక ప్రభుత్వం ఐఎంఏ జ్యువెలర్స్ కేసును సీబీఐకి అప్పగిస్తామని ఇప్పటికే చెప్పింది. దుబాయ్ లో ఉన్న అబ్బాస్ సీబీఐ అధికారుల ముందు హాజరు అయ్యే అవకాశం ఉంది. ఐఎంఏ స్కాం కేసు సీబీఐకి అప్పగించే విషయంలో పోలీసు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఐఎంఏ స్కాం కేసు విచారణ కోసం ప్రభుత్వం ఎస్ఐటీని నియమించింది. ఎస్ఐటీ అధికారులు విచారణ చేస్తున్న సమయంలో ఐఎంఏ స్కాం కేసు సీబీఐకి అప్పగించవలసిన అవసరం ఏముంది ? అంటూ పోలీసు అధికారులు అంటున్నారు. రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం కేసు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈకేసుతో ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, ఐఏఎస్ అధికారులకు సంబంధం ఉందని అనుమానాలు ఉన్నాయి.