తీపికబురు! ఈ ఏడాది సాధారణ వర్షపాతం: ఎల్ నినో బలహీనం!
న్యూఢిల్లీ: వాతావరణ శాఖ రైతులకు తీపి కబురు అందించింది. నాలుగేళ్లుగా తీవ్ర కరవు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోన్న రైతాంగానికి ఊరట కల్పించేలా ఓ ప్రకటన చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా వర్షాభావ పరిస్థితులు దాదాపుగా ఏర్పడకపోవచ్చని అంచనా వేసింది. వర్షాకాలం మొదలైన తొలి నాలుగు నెలల వ్యవధిలోనే దేశంలో 70 శాతం మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భూశాస్త్ర మంత్రిత్వశాఖ ఎం రాజీవన్ నాయర్ తెలిపారు. వర్షాకాలం ముగిసే నాటికి 90 నుంచి 95 శాతం మేర వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈశాన్య, నైరుతి రుతు పవనాలు సకాలంలో దేశంలోకి ప్రవేశిస్తాయని ఆయన వెల్లడించారు.
ఎండాకాలమంటూ సల్లబడుతున్నారా?.. బీరు సీసాల్లో తేళ్లు వస్తున్నాయట..! జర భద్రం
89 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం
సోమవారం మధ్యాహ్నం దేశ రాజధానిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాకాలం ముగిసే సమయానికి (లాంగ్ పీరియర్ యావరేజ్-ఎల్పీఏ) దేశంలో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని, సగటున 89 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని నాయర్ వెల్లడించారు. 1951, 2000 సంవత్సరాల్లో ఎల్పీఏ 89 సెంటీమీటర్ల మేర వర్షపాతం దేశంలో నమోదైందని, ఈ సారి ఈ సంఖ్య 90 నుంచి 95 సెంటీమీటర్లకు చేరుకోవచ్చని తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 89 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైతే, దాన్ని సాధారణం కంటే తక్కువగా నమోదైనట్లు గుర్తిస్తామని నాయర్ చెప్పారు. ఈశాన్య, నైరుతి రుతు పవనాలు దేశంలోకి ప్రవేశించిన వెంటనే.. చురుగ్గా కదులుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఎల్ నినో బలహీనం..
వాతావరణానికి సంబంధించి అత్యంత ప్రమాదకరంగా భావించే ఎల్ నినో ప్రభావం బలహీనపడిందని నాయర్ తెలిపారు. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై భూమధ్య రేఖ వెంబడి ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ.. అది బలహీనంగా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వేసవి సీజన్ ముగిసే వరకు ఎల్ నినో ప్రభావం భూమధ్య రేఖ వెంటే ఉంటుందని చెప్పారు. ఎల్ నినో పుంజుకుంటే.. దాని ప్రభావం జూన్, జులై నెలల్లో కురిసే వర్షాలపై ఉంటుందని అన్నారు. ఖరీఫ్ సహా వర్షాధార పంటలను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదని అంచనా వేసినట్లు చెప్పారు. ఎల్ నినో బలం పుంజుకునే అవకాశం కనిపించట్లేదని అన్నారు
సకాలంలో రుతుపవనాలు
దేశంలో సకాలంలో ఈశన్య, నైరుతి రుతు పవనాలు ప్రవేశిస్తాయని అన్నారు. వాటి కదలిక చురుగ్గా ఉంటుందని చెప్పారు. రుతు పవనాల కదలికలను దెబ్బతీసేలా వాతావరణంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఇప్పట్లో ఏర్పడే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నామని అన్నారు. ఎల్ నినో ప్రభావం బలహీనంగా ఉండటం వల్ల భేషుగ్గా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఎల్ నినో ప్రభావం ఏదైనా ఉంటే.. అది ఖరీఫ్ సీజన్ పై పడే అవకాశాలు ఉన్నాయని నాయర్ వెల్లడించారు.