చేదు కబురు: నైరుతి దోబూచులు: తీరాన్ని తాకడానికి 96 గంటలు!
తిరువనంతపురం: నైరుతి రుతు పవనాల రాకలో మరింత జాప్యం చోటు చేసుకోనుంది. ఈ నెల 6వ తేదీ నాటికి నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వారి అంచనాలను తలకిందులు చేశాయి నైరుతి రుతు పవనాలు. రుతు పవనాల రాకలో మరింత జాప్యం ఏర్పడనుంది. ఈ నెల 8వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకొచ్చని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.
అంతకుముందు- ఈ నెల 6వ తేదీన రుతు పవనాలు కేరళను తాకే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతు పవనాల రాకలో ఇప్పటికే ఆరు రోజుల జాప్యం చోటు చేసుకుందని, అయినప్పటికీ- ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఎక్కడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడకపోవచ్చని అభిప్రాయపడ్డారు. నైరుతి రుతు పవనాల్లో జాప్యం వల్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
బోల్తా కొడుతున్న అంచనాలు!
సాధారణంగా ఈ నెల 1వ తేదీ నాటికే రుతుపవానాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉంటుంది. వాతావరణ శాఖ అధికారులు దీనికి అనుగుణంగానే రుతు పవనాల గమనాన్ని అంచనా వేశారు. కిందటి నెలలోనే దీనికి సంబంధించిన ఓ వార్షిక క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ వర్షాకాలపు సీజన్ ముగిసే సరికి దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. 94 శాతం వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ అంచనాలు ఆరంభంలోనే గతి తప్పాయి. బోల్తా కొట్టాయి. జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతు పవనాలు కేరళను తాకుతాయని, అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తాయని పేర్కొన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపించాయి. నైరుతి రుతు పవనాల రాకలో అయిదురోజుల పాటు జాప్యం చోటు చేసుకుంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై నెలకొన్న ఎల్నినో ప్రభావం వల్లే నైరుతి రుతు పవానాల రాక ఆలస్యమైందని ఆ తరువాత వివరణ ఇచ్చుకున్నారు అధికారులు.
జూన్ 6వ తేదీ నాటికి నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని, ఈ సారి తమ అంచనా తప్పబోవని అన్నారు. ప్రస్తుతం కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులు- అధికారుల అంచనాలను మరోసారి తప్పేలా చేశాయి. తాజాగా నైరుతి రుతు పవనాలు ఈ నెల 8వ తేదీన కేరళ తీరాన్ని చేరుకుంటాయని వాతావరణ శాఖ డైరెక్టర్ హెచ్ ఆర్ బిశ్వాస్ తెలిపారు. రుతు పవనాల రాకలో 96 గంటల పాటు జాప్యం చోటు చేసుకుందని అన్నారు. 11వ తేదీ నాటికి కర్ణాటకకు చేరుకుంటాయని, దీని ప్రభావంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దక్షిణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 15వ తేదీ నాటికి ఉత్తర తెలంగాణలో రుతు పవనాల ప్రభావంతో వర్షాలు పడతాయని అంచనా వేశారు.