ఐఎండీ 'రెడ్ అలర్ట్'.. 2 రోజులు, ఆ 4గంటలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..
గత వారం రోజులుగా ఎండలు ముదిరిపోయాయి.. పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఇంటి నుంచి కాలు అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కూలర్,ఫ్యాన్ కొద్దిసేపు ఆగిపోయినా.. ఉక్కపోతను భరించలేకపోతున్నారు. మే చివరి వారంలో ఎండలు మరింత తీవ్రరూపం దాలిస్తే ఎలా అని భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఉత్తరాది రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. పగటిపూట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకురావద్దని హెచ్చరించింది.
ఢిల్లీలో పరిస్థితి ఇలా..
ఆదివారం(మే 24) ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమ(మే 25),మంగళ(మే 26) వారాల్లో వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం ఉందని.. ఢిల్లీలో మంగళవారం పలుచోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు 46డిగ్రీలకు చేరవచ్చునని ఐఎండీ తెలిపింది. చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని,కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో వాటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఆకాశం మబ్బులు లేకుండా ఉంటుందని,ఉపరితలంపై గంటకు 20కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
మే 28న దుమ్ము తుఫాన్..!
ఢిల్లీలోని సఫ్దర్గంజ్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నగరంలో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఇక కనిష్ట ఉష్ణోగ్రత 28.7గా నమోదైంది. ఇది సాధారణం కంటే రెండు రెట్లు ఎక్కువ. ఢిల్లీలోని పాలం,లోధి రోడ్,అయానగర్ ప్రాంతాల్లోని వాతావరణ కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 45.4డిగ్రీలు,44.2డిగ్రీలు,45.6డిగ్రీలుగా నమోదయ్యాయి. ఐఎండీ ప్రాంతీయ వాతావరణ విభాగం హెడ్ కులదీప్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఈ అధిక ఉష్ణోగ్రతల నుంచి మే 28న కొంత రిలీఫ్ కలిగే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో మే 29-30 తేదీల్లో గంటకు 60కి.మీ వేగంతో దుమ్ము తుఫాన్తో పాటు ఆకాశంలో ఉరుములు మెరుపులు సంభవించవచ్చునని చెప్పారు.
Recommended Video
ఉత్తరాది రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..
ఢిల్లీతో పాటు పంజాబ్,హర్యానా,చండీఘడ్,రాజస్తాన్ రాష్ట్రాలకు కూడా రాబోయే రెండు రోజులు ఐఎండీ 'రెడ్ వార్నింగ్' జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్కు 'ఆరెంజ్' వార్నింగ్ జారీ చేసింది. విశాలమైన ప్రాంతాల్లో వరుసగా రెండు రోజులు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్ను టచ్ అయినప్పుడు హీట్ వేవ్గా ప్రకటిస్తారు. ఒకవేళ పాదరసం 47డిగ్రీలకు చేరితే తీవ్రమైన హీట్వేవ్గా పరిగణిస్తారు. ఢిల్లీ లాంటి నగరాల్లో అయితే ఒకరోజు 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా హీట్వేవ్గా ప్రకటిస్తారు. ఏదేమైనా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరాది ప్రజలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది.