ఆగస్టులో దేశవ్యాప్తంగా 25 శాతం ఎక్కువ వర్షాలు- 44 ఏళ్లలో తొలిసారి...
దేశవ్యాప్తంగా ఈసారి వర్షాలు దంచి కొడుతున్నాయి. వేసవి ముగియగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఆగస్టు నెలలోనూ రుతుపవనాల జాడ కనిపించని రాష్ట్రాల్లో సైతం మెరుగైన వర్షపాతం నమోదవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా తాజా వివరాలను భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
Recommended Video
ఐఎండీ ప్రకటించిన తాజా వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో సాధారణం కంటే 25 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇలా ఆగస్టు నెలలో అధిక వర్షపాతం నమోదు కావడం ఇది 44 ఏళ్ల తర్వాత తొలిసారి కావడం విశేషం. 44 ఏళ్ల క్రితం 1976 ఆగస్టులో 28.4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ సీజన్లో నమోదైన మొత్తం వర్షపాతాన్ని గమనిస్తే 9 శాతం అధికమని తేలింది. దీంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వరుస వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అధిక వర్షపాతం నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, తమిళనాడు, గుజరాత్, గోవా ఉన్నాయి. సిక్కింలో అయితే మరీ అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు గతేడాది కన్నా అదికంగా ఉన్నట్లు కేంద్ర జలసంఘం వెల్లడించింది. గత పదేళ్లలో అత్యధికంగా జలాశయాల్లో నీటి నిల్వలు చేరినట్లు జలసంఘం నివేదికలు చెబుతున్నాయి.
ఇంత అధిక వర్షపాత పరిస్ధితుల్లోనూ కొన్ని చోట్ల మాత్రం తక్కువ వర్షపాతాలు నమోదవుతున్నాయి. జమ్మూ, కశ్మీర్తో పాటు మిజోరం, మణిపూర్, నాగాలాండ్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఈ సీజన్ మొత్తం కలుపుకుంటే గతేడాదితో పోలిస్తే 104 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేస్తోంది.