భారత వాతావరణ సూచనలు: పీవోకేపై భారత కీలక ముందడుగు
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ మరో కీలక ముందడుగు వేసింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ప్రాంతాల్లో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ సూచనలు జారీ చేయనుంది. గతంలో పలు కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో ఐఎండీ వాతావరణ సూచనలు నిలిపివేసింది.
'వచ్చే 2 నెలల్లో కరోనా విజృంభించే ఛాన్స్: లాక్ డౌన్ కొనసాగించాల్సిందే!’
పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిత్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్లలో మే 5వ తేదీ నుంచి జమ్మూకాశ్మీర్లోని ప్రాంతీయ వాతావరణ విభాగం(ఆర్ఎండీ) ఆధ్వర్యంలో వాతావారణ మార్పులకు సంబంధించిన సూచనలు జారీ చేస్తున్నట్లు ఆర్ఎండీ హెడ్ కుల్ దీప్ శ్రీవాత్సవ వెల్లడించారు.
కాగా, పీవోకేలోని ప్రాంతాలను జమ్మూకాశ్మీర్ సబ్ డివిజన్లో భాగంగా పరిగణించనున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర కూడా వెల్లడించారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. గిల్గిత్-బాల్టిస్థాన్లు తమ దేశంలో భాగమని, వాటిని ఎప్పటికీ తమ నుంచి వేరుచేయలేరని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
భారత విదేశాంగ శాఖ పీవోకేలో ఎలాంటి మార్పులను భారత్ సహించబోదని తేల్చి చెప్పింది. జమ్మూకాశ్మీర్, లడఖ్ తోపాటు గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతాలు కూడా చట్టబద్ధంగా భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి గుర్తు చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి గానీ, అక్కడి న్యాయవ్యవస్థకు గానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జోక్యం చేసుకునే అర్హత, అధికారం లేవని భారత్ తేల్చి చెప్పింది.
ఇదే విషయాన్ని పాక్కు స్పష్టం చేయాలని ప్రధాన ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో కూడా వాతావరణ సూచనలు చేయాలని ఐఎండీకి సూచించినట్లు తెలుస్తోంది.