కేరళకు జూన్ 1 నుంచి నైరుతి రుతుపవనాలు: రెండు అల్పపీడనాలు
న్యూఢిల్లీ: దేశంలోకి నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి ప్రవేశించే అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. మే 31న ఆగ్నేయ, ప్రక్కనే ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని, దీని వల్ల రుతుపవనాలు సకాలంలో ప్రవేశించనుందని వెల్లడించింది.
వచ్చే 48గంటల్లో..
ఇప్పుడు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. గురువారం నాటికి మాల్దీవులు-కమోరిన్ ప్రాంతం, సహా మిగితా అండమాన్ దీవుల్లోకి విస్తరించినట్లు వెల్లడించింది. వచ్చే 48 గంటల్లో మాల్దీవులు-కమోరిన్ ప్రాంతంలోని మిగితా చోట్లలో ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది.
అల్పపీడనం..
మే 31 నుంచి జూన్ 4 మధ్య కాలంలో పశ్చిమ మధ్య, పక్కనే ఉన్న నైరుతి అరేబియా సముద్రంపై తుఫాను ఆవర్తన ప్రభావంతో.. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని తెలిపింది. దీనికి అనుబంధంగా తుఫాను ఆవర్తనం ట్రోపోస్పియర్ స్థాయి వరకు విస్తరించిందని వెల్లడించింది.
రెండు అల్పపీడనాలు..
కాగా, రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. వచ్చే 72 గంటల్లో వాయువ్యదిశగా ఇది దక్షణ ఒమన్, తూర్పు యెమన్ తీరంవైపు కదిలే అవకాశం ఉందని ఐంఎండీ తెలిపింది. కాగా, అరేబియా సముద్రంలో రెండు అల్పపీడనాలు ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, వెళ్లినవారు వెంటనే తిరిగి వచ్చేయాలని స్పష్టం చేసింది. కాగా, దేశంలోకి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకి.. తర్వాత దేశమంతటా విస్తరిస్తాయి. కేరళ నుంచి కర్ణాటక మీదుగా ఏపీ, తెలంగాణలోకి ప్రవేశిస్తాయి.