ఆ రకంగా మేలు చేసిన కరోనా: చురుగ్గా రుతుపవనాలు: సకాలంలో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల ఒకవంక ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతూ ఉండగా.. దాని వల్ల మేలు కలిగిన సందర్భాలు కూడా లేకపోలేదు. సమస్త మానవజాతిని పట్టి పీడిస్తోన్న ప్రస్తుత సమయంలో ఆ వైరస్ వల్ల పర్యావరణానికి ప్రయోజనం కలిగిందని అంటున్నారు నిపుణులు. కరోనా వైరస్ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ ప్రకటించడం వల్ల అన్ని రకాల కాలుష్యం తగ్గిందని, ఫలితంగా ఇదివరకెప్పుడూ లేనివిధంగా పర్యావరణం మెరుగుపడిందని అంటున్నారు.
మనదేశంలో విధించిన లాక్డౌన్ వల్ల వాయు కాలుష్యం దాదాపు 90 శాతం వరకు క్షీణించిందని, ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. దీని ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదు కావచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఐఎండీ అధికారులు బుధవారం ఉదయం న్యూఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది వర్షాకాల స్థితిగతులపై అంచనాలను రూపొందించారు. లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ (ఎల్ఆర్ఎఫ్) పై ఆరా తీశారు. లాక్డౌన్ వల్ల వాతావరణం కాలుష్య శాతం అంచనాలకు మించిన స్థాయిలో పడిపోయిందని, దీని ప్రభావం నైరుతి రుతు పవనాల కదలికలపై సానుకూలంగా ఉంటుందని అంచనా వేశారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కదలికలు అంచనాలకు మించిన స్థాయిలో ఉంటాయని వెల్లడించారు. మే 31వ తేదీ నాటికే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఇదివరకు ఎప్పుడూ లేని స్థాయిలో క్షీణించడం వల్ల వర్షాకాల సీజన్ కాస్త ముందే ఆరంభం కావచ్చని అన్నారు. ఎల్నినో ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయ పడ్డారు.
నిజానికి- వాతావరణ విభాగం అధికారులు ఏటేటా రెండుసార్లు లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ను ప్రకటిస్తారు. ఇందులో భాగంగా తొలి ఎల్ఆర్ఎఫ్ను వెల్లడించడానికి అధికారులు ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వల్ల వాతావరణంలో కాలుష్య తగ్గిందని, ఆకాశం నిర్మలంగా ఉంటోందని ఫలితంగా- నైరుతి రుతుపవనాల్లో చురుకైన కదలికలు కనిపిస్తాయని అంచనా వేశారు. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా నైరుతి రుతుపవానల్లో కదలికలు చోటు చేసుకుంటాయని అభిప్రాయపడ్డారు.
Recommended Video