ఆర్థిక వృద్ధికి భారత్ వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రమాదమే: ఐఎంఎఫ్
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా వ్యవహరించే భారత ఆర్థిక వ్యవస్థ మందగించడంపై ఇంటర్నేషనల్ మోనిటరీఫండ్ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూచించింది. వినియోగం తగ్గిపోవడం, పెట్టుబడులు రాకపోవడం, టాక్స్ రెవిన్యూ పతనం కావడంతో పాటు ఇతర అంశాలు కూడా భారత ఆర్థిక వ్యవస్థ పతనంకు కారణమని ఐఎంఎఫ్ తన వార్షిక సమీక్షలో తెలిపింది.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉందని చెప్పిన ఐఎంఎఫ్ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతంపు అధికారి రణిల్ సాల్గాడో... భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవాలంటే వెంటనే విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపీనాథ్ కూడా భారత ఆర్థిక మందగమనంపై ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే నెల విడుదల కానున్న వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్... భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు దారుణంగా పడిపోయిందనే రిపోర్టు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.
ఇక 2019కి గాను భారత వృద్ధి రేటు 6.1శాతం మేరా తగ్గి పోతుందని ఐఎంఎఫ్ ఈ ఏడాది అక్టోబర్లో అంచనా వేసింది. 2020కి ఇది 7.0శాతానికి పడిపోతుందని జోస్యం చెప్పింది. ఇదిలా ఉంటే ఆర్థిక మందగమనం కొనసాగితే ఇక రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింత తగ్గించాల్సి ఉంటుందని సాల్గాడో అన్నారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన రిజర్వ్ బ్యాంక్ సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. 6.1గా ఉన్న వృద్ధి రేటును 5శాతంకు పడిపోతుందని అంచనా వేసింది. వినియోగం తగ్గిపోవడం, ఉత్పత్తి రంగం పడిపోవడంతోనే ఇది జరిగిందని ఆర్బీఐ చెప్పుకొచ్చింది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం భారత వృద్ధి రేటు ఎప్పుడూ లేనంతగా 4.5శాతంకు పడిపోయింది. ఈ గణాంకాలు చూస్తే చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పిన సాల్గాడో... భారత ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆరోగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థకు భారత్ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.