భారత వృద్ధిరేటు అంచనాను 4.8శాతానికి తగ్గించిన ఐఎంఎఫ్: ఇవే 2 కారణాలు
దావోస్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) మరోసారి భారత వృద్ధిరేటు అంచనాను తగ్గించింది. 2020లో భారత వృద్ధిరేటు 4.8శాతంగా ఉండనుందని సోమవారం పేర్కొంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సెక్టార్, బలహీన గ్రామీణ ఆదాయం పెరుగుదల వృద్ధిరేటు తగ్గించడానికి గల కారణాలని విశ్లేషించింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం జరుగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఈ సంస్థ తాజా నివేదికలను వెల్లడించింది. భారత వృద్ధిరేటు అంచనాలను 2020కి గానూ 4.8శాతంకు తగ్గించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి ఈ అంచనా వృద్ధిరేటు 5.8శాతం ఉండనుందని వెల్లడించింది.
అయితే, 2022 ఆర్థిక సంవత్సరం నాటికి భారత వృద్ధిరేటు 6.5 శాతానికి చేరుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్, క్రెడిట్ గ్రోత్ క్షీణత కారణంగా భారత వృద్ధిరేటు అంచనాల తగ్గుదలకు కారణమయ్యాయని సంస్థ తెలిపింది. భారత దేశీయ డిమాండ్ అనుకున్నదానికంటే వేగంగా పడిపోయిందని పేర్కొంది.
అదే విధంగా అంతర్జాతీయ వృద్ధిరేటును కూడా ఐఎంఎఫ్ తగ్గించింది. 2019లో అంచనా వృద్ధిరేటు 2.9శాతానికి, 2020కి 3.3శాతానికి, 2021 ఆర్థిక సంవత్సరానికి 3.4శాతానికి తగ్గించింది. వచ్చే రెండేళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ భారత్ లాంటి దేశాలు వృద్ధిరేటును సల్పంగా పెంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని తెలిపిింది.
ఎమర్జింగ్ మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2019లో 3.7శాతం ఉంటే, 2020 నాటికి 4.4శాతంగా, 2021లో 4.6శాతానికి పెరుగుదల నమోదు చేస్తాయని అంచనా వేసింది. 0.2శాతం పెరుగుదులను నమోదు చేస్తున్నాయని వెల్లడించింది.
ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాత్ మాట్లాడుతూ.. ఈ సవరణకు అతిపెద్ద సహకారిగా భారతదేశం ఉండనుందని చెప్పారు. అయితే, ఇక్కడ బ్యాంకేతర ఆర్థిక రంగంలో ఒత్తిడి, బలహీనమైన గ్రామీణ ఆదాయ వృద్ధి కారణంగానే వృద్ధిరేటు మందగించిందని తెలిపారు.
కాగా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కూడా వృద్ధిరేటు అంచనాలు మందగమనంలోనే ఉన్నాయి. 2019లో వృద్ధి 1.7శాతం ఉండగా.. ఇది 2020, 2021 నాటికి 1.6శాతానికి పడిపోనుందని ఐఎంఎఫ్ తేల్చింది.