వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుంది: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాన్ని పెంచేవేనని తెలిపారు.
అయితే, సాగుదారులకు సామాజిక భద్రతా వలయం అందించాల్సిన ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేగాక, భారత వ్యవసాయ రంగానికి సంస్కరణలు ఎంతో అవసరమని గీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు.
'మౌలిక సదుపాయాలతో సహా సంస్కరణలు అవసరమయ్యే అనేక ప్రాంతాలు ఉన్నాయి' అని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ ఆర్థిక సంస్థ చీఫ్ ఎకనామిస్ట్ చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్లో అమల్లోకి వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయ రంగంలో ప్రధాన సంస్కరణలుగా భారత ప్రభుత్వం అంచనా వేసింది, ఇవి మధ్యవర్తులను తొలగించి, రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించడానికి వీలు కల్పిస్తాయని కేంద్రం స్పస్టం చేసిన విషయం తెలిసందే.
కొత్త వ్యవసాయ చట్టాలపై ఒక ప్రశ్నకు సమాధానంగా గోపీనాథ్ ఇలా అన్నారు.. "ఈ ప్రత్యేకమైన వ్యవసాయ చట్టాలు మార్కెటింగ్ రంగంలో ఉన్నాయి, ఇది రైతులకు మార్కెట్ను విస్తృతం చేస్తోంది. ఎటువంటి పన్ను లేకుండానే మండిస్తో పాటు పలు ఔట్లెట్లకు విక్రయించే అవకాశం ఈ చట్టాలు కల్పిస్తున్నాయి. ఇది మా దృష్టిలో, రైతుల ఆదాయాలను పెంచేది ఉందని గీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు.
'ఒక సంస్కరణ అమల్లోకి వచ్చిన ప్రతిసారీ, పరివర్తన ఖర్చులు ఉంటాయి. సామాజిక భద్రతా వలయం కల్పించబడిందని నిర్ధారించుకోవడానికి, రైతులకు హాని కలిగించకుండా చూసుకోవాలి, చాలా శ్రద్ధ వహించాలి. ఇప్పుడే చర్చించండి, దాని నుండి ఏమి వస్తుందో చూద్దాం' అని ఆమె అన్నారు.
కాగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు.. గత ఏడాది నవంబర్ 28 నుంచి ఢిల్లీ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పి) పై చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర కల్పిస్తామని కేంద్రం స్పష్టం చేసింది, అయితే, వ్యవసాయ చట్టాలను మాత్రం రద్దు చేయమని తెలిపింది. ఒకటిన్నర సంవత్సరాలు వాయిదా వేసేందుకు కూడా సర్కారు దిగివచ్చింది. అయితే, రైతులు మాత్రం ఆ చట్టాలను ఇప్పుడే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Recommended Video