ఏపీ దిశ బిల్లును దేశ వ్యాప్తంగా తీసుకురండి: ఢిల్లీలో దీక్ష, ప్రధానికి స్వాతి మాలీవాల్ లేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన దిశ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా ఏపీ సర్కారు దిశ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
మోడీకి లేఖ
ఈ దిశ చట్టం ద్వారా ఇలాంటి కేసులను 21 రోజుల్లోనే పరిష్కరించి దోషులకు జీవితఖైదు లేదా మరణశిక్ష విధించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దిశ చట్టాన్ని తక్షణమే దేశ వ్యాప్తంగా తీసుకురావాలంటూ స్వాతి మాలీవాల్ ప్రధాని మోడీకి రాసిన లేఖలో కోరారు.
దిశ బిల్లు దేశ వ్యాప్తంగా తీసుకొచ్చేంత వరకు దీక్ష
మహిళల రక్షణపై కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపిస్టులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్వాతి మాలీవాల్ గత పదిరోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దిశ బిల్లును దేశ వ్యాప్తంగా తీసుకొచ్చేంత వరకు తాను నిరాహార దీక్ష విరమించేది లేదని స్వాతి మాలీవాల్ స్పష్టం చేశారు.
మహిళల, ఆడపిల్లలపై జరిగే దారుణాలపై..
మహిళల, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను, లైంగిక దాడులను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం అనే పేరుతో ఒక కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ బిల్లును హోంమంత్రి సుచరిత 2019, డిసెంబరు 13న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ దిశ చట్టాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చట్టం ద్వారా మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 21 రోజుల్లో రేప్ కేసుపై జడ్జిమెంట్ రానుంది.
జీవిత ఖైదు లేదా ఉరి..
ఈ దిశ ప్రకారం 14 రోజుల్లోపే విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడే విధంగా చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంలో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి జీవితఖైదుగా లేదా ఉరిశిక్షకూ అవకాశం ఉంది. సోషల్, మీడియాల్లో వేధింపులకు పాల్పడే వారిని శిక్షించేందుకు ఐపిసిలో 354(ఇ) అనే కొత్త సెక్షన్ తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం మొదటి తప్పుకు రెండేళ్లు, రెండవ తప్పుకు నాలుగేళ్లు శిక్ష విధించనున్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విచారణకు త్వరగా జరిగేలా ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.