నాతో పడుకుంటావా: విమానాశ్రయంలో మహిళపై వేధింపులు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మహిళలకు భద్రతలేదనే జగమెరిగిన సత్యం. అయితే నిత్యం కట్టుదిట్టమైన భద్రత, దేశ విదేశాల నుండి వీవీఐపీలు వచ్చే ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఓ మహిళ వేదింపులకు గురి అయ్యింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్థించిన సదరు అధికారిని సస్పెండ్ చెయ్యాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హాంకాంగ్ లో ఉంటున్న భర్తను కలిసేందుకు బెంగళూరులో నివాసం ఉంటున్న ఓ మహిళ ఈ నెల 18వ తేదీన ఒంటరిగా బయలుదేరారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకున్న ఆ మహిళ ఇమిగ్రేషన్ అధికారులను కలిసేందుకు వెళ్లారు. ఆసమయంలో ఇమిగ్రేషన్ అధికారి వినోద్ కుమార్ అనే వ్యక్తిని ఆమె కలిశారు.
తాను హాంకాంగ్ వెళుతున్నానని, క్లియరెన్స్ కోసం వచ్చానని ఆ మహిళ చెప్పారు. నిబంధనల ప్రకారం విమానంలో ప్రయాణించే వారు ఎయిర్ పోర్టు అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఇమిగ్రేషన్ అధికారి వినోద్ కుమార్ ఆ మహిళను తన క్యాబిన్కు పిలుచుకుని వెళ్లాడు.
‘నీకు ఎంత మంది పిల్లలు ? నీ భర్త హాంకాంగ్ లో ఉంటున్నాడు కదా, ఆయన లేని సమయంలో వేరే మగాళ్లతో జల్సాలు చేస్తుంటావా, నాతో కలిసి పడుకుని సహజీవనం చేసి ఒక బిడ్డకు తల్లి అవుతావా, ఎందు కంటే నా భార్య మూడవ బిడ్డకు జన్మనివ్వలేదు, ఒంటరిగా హాంకాంగ్ వెళుతున్నావు, అక్కడ మజా చెయ్యడానికి వెళుతున్నావా 'అంటు అసభ్యంగా ప్రవర్థించాడు.
అతని అసభ్యకరమైన ప్రశ్నలతో విసిగిపోయిన ఆ మహిళ వెంటనే బెంగళూరులో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చారు. ఆ మహిళ, ఆమె బంధవులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు ఎయిర్ పోర్టులోని సీసీకెమెరాలలోని పుటేజ్ లు పరిశీలించారు.
ఎయిర్ పోర్టులో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్థించిన వినోద్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చెయ్యాలని కేంద్ర హోం శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేస్తున్నారు.