సిద్ధూ! నీకు దేశం కంటే ఇమ్రాన్ఖాన్తో స్నేహమే ఎక్కువా?: కేజ్రీవాల్ సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రవాద దాడిపై పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు దేశం కంటే స్నేహం (ఇమ్రాన్ ఖాన్తో స్నేహం) ఎక్కువ కావొచ్చు అని విమర్శలు గుప్పించారు.
సిద్ధూ.. దేశం కంటే స్నేహం ఎక్కువా?
సిద్ధూ భారత్ బాగుకోరడం కంటే ఇమ్రాన్ ఖాన్తో తన స్నేహం చెడిపోవద్దని కోరుకుంటున్నట్లుగా ఉందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. సిద్ధూ చేసిన వ్యాఖ్యలు భారత ప్రజలను అవమానించడమే అన్నారు. దేశం కంటే స్నేహం తనకు ఎక్కువ అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. సిద్ధూ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇమ్రాన్ ఖాన్కు ఓ ఛాన్స్ ఇద్దాం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై ఓ వైపు భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పీడీపీ అధినేత్రి, జమ్ము కాశ్మీరా మాజీ సీఎం ముఫ్తీ మాత్రం భిన్నంగా స్పందించారు. ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టారని, ఇరు దేశాల మధ్య కొత్తగా చర్చలు ప్రారంభిద్దామని చెబుతున్నారని, అందువల్ల ఆయనకు ఓ అవకాశం ఇచ్చి చూడాలన్నారు. పఠాన్కోట్, ముంబై దాడుల విషయంలో పాకిస్థాన్కు ఆధారాలను అందజేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వాస్తవమేనని, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అడిగినట్టుగా పుల్వామా దాడిపై పాకిస్థాన్కు ఆధారాలను అందజేయాలని, ఆ తర్వాత వారు ఏం చేస్తారో చూడాలన్నారు.
పాక్ నుంచి వచ్చిన ఆర్డీఎక్స్
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడికి పాల్పడేందుకు వినియోగించిన పేలుడు పదార్థాన్ని పాకిస్థాన్ నుంచి భారత్కు తరలించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. పేలుడు జరిగిన తీరును బట్టి మిలటరీ గ్రేడ్ ఆర్డీఎక్స్ను వాడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పాక్ రక్షణ వర్గాల నుంచి తప్పితే బయట దీనిని సేకరించడం సాధ్యం కాదని, భారత సైన్యం వినియోగించే ప్రతిగ్రాము ఆర్డీఎక్స్కు ఆడిటింగ్ ఉంటుందని, నిపుణుల అంచనా ప్రకారం పేలుడుకు మారుతీ ఎకో వాహనాన్ని వినియోగించినట్లు తేలిందని తెలుస్తోంది. ఆర్డీఎక్స్ కొన్ని నెలల క్రితమే భారత్కు కొద్దికొద్దిగా తరలించినట్లు భావిస్తున్నారు. దీనికి కచ్చితంగా భారత్లో అసెంబుల్ చేసే అవకాశముంది. అది కూడా పేలుడు జరిగిన ప్రదేశానికి ఏడు కి.మీ. లోపే దీనిని తయారు చేసినట్లు అంచనా వేస్తున్నారు.