ఇమ్రాన్ ఖాన్ ఘాటు ట్వీట్లు: గుజరాత్లోలా కశ్మీర్లో కూడా ముస్లింలు లేకుండా చేస్తారా..?
ఇస్లామాబాద్ : జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక పొరుగు దేశం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్పై తన అక్కసును వెల్లగక్కుతూనే ఉన్నారు. అంతర్జాతీయ సమాజంలో భారత్ను చెడ్డ చేయాలని చూసి చతికిలపడ్డ ఇమ్రాన్ ఖాన్.... తాజాగా కశ్మీర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలో నివసిస్తున్న ముస్లింల కోసం ఎందాకైనా వెళతామని వ్యాఖ్యానించారు. అవసరమైతే యుద్ధం కూడా చేస్తామని హెచ్చరించారు.
కశ్మీర్లో ఏం జరుగుతోంది... ఇమ్రాన్ ప్రశ్న
కశ్మీర్లో ఏం జరుగుతోంది అని ప్రశ్నించిన ఇమ్రాన్ఖాన్... గత 12 రోజులుగా అక్కడ కర్ఫ్యూ విధించి ముస్లింలను కట్టడి చేస్తున్నారని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ ముస్లింలను ఆ రాష్ట్రం నుంచి ఎలాగైతే ఏరిపారేశారో... ఇప్పుడు కశ్మీర్లో కూడా ముస్లిం సోదరులను ఏరిపారేయాలని చూస్తున్నారంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. కశ్మీర్లో మోడీ సర్కార్ విధించిన ఆంక్షలపై ప్రపంచదేశాలు మౌనం వహిస్తే తామే ముందడుగు వేస్తామని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు తిరగబడతారు
భారత ఆక్రమిత కశ్మీర్లో కర్ఫ్యూ విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం తిరగబడుతుందని ఆ తర్వాత హింస నెలకొంటుందని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఒక్క కశ్మీర్కో లేక పాకిస్తాన్కో లేక భారత ముస్లింలకో క్రైస్తవులకో, దళితులనో భయపెట్టడం లేదని మొత్తం భారత దేశాన్నే నాశనం చేసేందుకు తయారయ్యారని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.
యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం: ఇమ్రాన్ ఖాన్
ఇక భారత ఆక్రమిత కశ్మీర్లో ఏదైనా చర్యలు తీసుకుంటే ప్రతి చర్యకు కూడా సిద్ధంగా ఉండాలని ఇమ్రాన్ఖాన్ ప్రధాని మోడీని హెచ్చరించారు. ఇప్పటికే ఆర్మీ యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉందని.. ఒక్క ఆర్మీనే కాదు.... మొత్తం దేశమంతా పోరాడుతుందని ఇమ్రాన్ ఖాన్ బుధవారం హెచ్చరించారు. ముస్లింలు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమయంలో వారి ముందు పెద్ద పెద్ద దేశాల ఆర్మీలే తోకముడిచాయని చెప్పారు. భారత్ వేస్తున్న అడుగులు తమకు తెలుసని చెప్పిన ఇమ్రాన్ ఖాన్... పుల్వామా తరహా దాడులను కారణంగా చూపి పీఓకేపై విరుచుకుపడేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందన్న విషయం తెలుసని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
మోడీ అభివృద్ధి గురించి మాట్లాడితే... ఖాన్ యుద్ధం గురించి మాట్లాడారు
ప్రపంచంలోని ముస్లిం సామాజిక వర్గంకు చెందిన వారంతా ఐక్యరాజ్యసమితి వైపు చూస్తున్నారని అన్నారు ఇమ్రాన్ ఖాన్. సెప్టెంబర్లో జరిగే ఐక్యారాజ్య సమితికి ఎంతమంది వస్తారో మీరే చూస్తూరంటూ చెప్పుకొచ్చారు. ప్రతి వేదికపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తానని చెప్పిన ఇమ్రాన్ ఖాన్.... కశ్మీర్కు తాను అంబాసిడర్గా మారుతానని చెప్పారు. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇమ్రాన్ ఖాన్ యుద్ధం గురించి మాట్లాడితే భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున మోడీ అభివృద్ధి గురించి మాట్లాడారు. తన 94 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో ప్రధాని మోడీ ఎక్కడే కానీ పాకిస్తాన్ అనే పదాన్ని ఉచ్చరించలేదు.