గోద్రా-సిక్కు వ్యతిరేక అల్లర్లు: మోడీపై రాహుల్, నో సారీ
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేరుగా ఎదురు దాడికి దిగారు. అదే సమయంలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లపై క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. సోమవారం ఆయన టైమ్స్ నౌ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్బంగా రాహుల్ 2002 నాటి గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ మోడీ సర్కారుపై మరోసారి మండిపడ్డారు. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగినప్పటికీ అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు వాటిని ఆపేందుకు కృషి చేసిందని, కానీ 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లను ఆ రాష్ట్ర సర్కారే ఎగదోసిందని ఆరోపించారు. తాను మోడీకి భయపడనని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిజెపిని ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
1984లో జరిగిన అల్లర్లలో చాలామంది సిక్కు అమాయకులు చనిపోయారని ఎక్కడైనాగా నీ, అమాయకులు చనిపోవడం బాధాకరమేనని రాహుల్ ఆవేదన వెలిబుచ్చారు. అయితే, ఆ అల్లర్లకూ గుజరాత్ అల్లర్లకూ తేడా ఉందని, గుజరాత్లో ప్రభుత్వమే వాటికి కారణమైందని ఆరోపించారు. మోడీకి కోర్టులు క్లీన్చిట్ ఇచ్చాక కూడా అలా ఎలా అనగలరని ప్రశ్నించగా.. ఇది తన ఒక్కడి మాట కాదని, ఆ అల్లర్లలో గుజరాత్ ప్రభుత్వ పాత్రను చూసిన చాలా మంది ప్రజల మాట అని అన్నారు.
తన ఉద్దేశం ప్రజలు దాన్ని చూశారని, తాను చూడలేదని అన్నారు. మీ మీడియా సహచరులే చూశారన్నారు. పాలనాయంత్రాంగం మైనారిటీల మీద ఎలా చురుగ్గా దాడులు చేసిందీ వాళ్లు తనకు చెప్పారని, మరి 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు క్షమాపణ చెబుతారా అని ప్రశ్నించగా అదొక భయానక ఘటన అని, ఆ అల్లర్లలో తాను పాల్గొనలేదని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి సిద్ధంగా ఉందని తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఒకవేళ తాము గెలవలేకపోతే పార్టీ ఉపాధ్యక్షుడుగా అందుకు తాను బాధ్యత వహిస్తానని, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బిజెపి అధికారాన్ని ఒక వ్యక్తి వద్దే కేంద్రీకరిస్తోందని అలాంటి వాటిని తాను వ్యతిరేకిస్తానని, తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకముందని అన్నారు. ఎంపీలను సంప్రదించకుండా ప్రధాని అభ్యర్థిని ప్రకటించడమనేది రాజ్యాంగంలో రాసి లేదని వ్యంగ్యంగా అన్నారు. 2009లో తమ ప్రధాని అభ్యర్థిగా మన్మోహన్ని ప్రకటించడం, బిజెపి మోడీని ప్రకటించడం ఒకటి కాదన్నారు.
మన్మోహన్ అప్పటికే ప్రధాని అని, ఆయన గెలిచారు కాబట్టి ఎంపీలు ఆయన్నే కొనసాగించాలనుకొన్నారని సర్ది చెప్పారు. తాను వంశపాలనకు పూర్తిగా వ్యతిరేకమని కానీ కాంగ్రెస్, బిజెపి, ఎస్పీ, డిఎంకె ఇలా అన్ని పార్టీల్లోనూ ఇది కొనసాగుతోందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుపై అడిగిన ప్రశ్నకు ఆ పార్టీకి నిరూపించుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని తమ పార్టీ భావించిందని సమాధానమిచ్చారు.