ఆ రోజు అమిత్ షాతో ఆడుకున్న చిదంబరంకు 9 ఏళ్లకు చిక్కులు, కాలచక్రం తిరిగింది అంతే !
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా స్కాం కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం చిక్కుల్లో పడ్డారు. మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను అరెస్టు చెయ్యడానికి మూడు సార్లు వెళ్లిన సీబీఐ చివరికి ఉత్త చేతులతో వెనుతిరిగింది. సరిగ్గా 9 ఏళ్ల క్రితం పి. చిదంబరం కేంద్ర హోం శాఖా మంత్రి. ఆ సమయంలో అమిత్ షాతో ఆడుకోవడంతో ఆయన అరెస్టు అయ్యారు. ఇప్పుడు అదే అమిత్ షా హోం శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కాలచక్రం తిరిగింది. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంను అరెస్టు చెయ్యడానికి సీబీఐ అధికారులు తిరుగుతున్నారు.
ఆ రోజు చిదంబరం చాన్స్
9 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. అప్పుడు కేంద్ర మంత్రిగా పి. చిదంబరం ఉన్నారు. 2010లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ, హోం శాఖా మంత్రిగా అమిత్ షా ఉన్నారు. సహ్రోబుద్దిన్ షేక్ నకిలి పోలీసు ఎన్ కౌంటర్ కేసులో 2010 జులై 25వ తేదీ సీబీఐ అధికారులు అమిత్ షాను విచారణ చేసి చివరికి అరెస్టు చేశారు. 2010 ఆగస్టు 7వ తేదీ వరకు అమిత్ షాను అహమ్మదాబాద్ లోని సబర్మతి జైల్లో పెట్టారు. అప్పట్లో అమిత్ షా మీద హత్య, లూటీ, కిడ్నాప్ తదితర కేసులు నమోదు చేశారు.
ఒకటి కాదు రెండు కాదు 20 సార్లు అరెస్ట్ నుంచి ఎస్కేప్.. ఇదీ చిదంబరం, కార్తీ పిటిషిన్ల పరంపరం
కక్ష కట్టిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ సీబీఐని తనకు కావలసిన రీతిలో వాడుకుంటున్నదని అప్పట్లో బీజేపీ నాయకులతో పాటు సాక్షాత్తు అమిత్ షా ఆరోపించారు. తాను నిరపరాది, తన మీద కట్టు కథలు అల్లి అరెస్టు చేశారని, రాజకీయ కక్షలతో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సూచనలతో సీబీఐ తనను అరెస్టు చేసిందని ఆ రోజు అమిత్ షా ఆరోపించారు. తనను సీబీఐ విచారణ చేసే సమయంలో పూర్తిగా వీడియో తియ్యాలని ఆ రోజు అమిత్ షా డిమాండ్ చేశారు.
సాక్షాలు లేవని అమిత్ షా !
అమిత్ షా మీద నమోదు అయిన కేసుల్లో సరైన సాక్షాధారాలు లేవని 2014 డిసెంబర్ లో ప్రత్యేక సీబీఐ కోర్టు చెప్పింది. అప్పుడే సీబీఐ ప్రత్యేక కోర్టు అమిత్ షాకు కేసు నుంచి విముక్తి కల్పించింది. సహ్రోబుద్దిన్ ఎన్ కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని 2017 ఆగస్టులో కేసు నుంచి విముక్తి కల్పించింది.
9 ఏళ్లకు చిదంబరంకు చిక్కులు !
కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో చిదంబరం అమిత్ షాతో ఆడుకున్నారని బీజేపీ ఆరోపించింది. 9 ఏళ్ల తరువాత అదే చిదంబరం చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు అమిత్ షా కేంద్ర హోం శాఖా మంత్రి. మనిలాండ్రింగ్, అధికార దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని చిదంబరం మీద కేసులు నమోదైనాయి. చిదంబరం తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మనవి చెయ్యడంతో జామీను ఇవ్వడానికి ఢిల్లీ హై కోర్టు మంగళవారం (ఆగస్టు 20వ తేది) నిరాకరించింది. హై కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ చిదంబరం న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయోధ్య భూ వివాదం కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగాయ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బెంచ్ విచారణ చేస్తోంది. అందువలన చిదంబరం పిటిషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించలేదు.
కాలచక్రం తిరిగింది
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీబీఐని అడ్డం పెట్టుకుని మా మీద కక్ష తీర్చుకుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకుల మీద అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కాలచక్రం తిరుగుతుంది, అన్ని రోజులు ఒకే విదంగా ఉండవు అనడానికి అమిత్ షా, చిదంబరం సంఘటనలే చిన్న ఉదాహరణ. ఆ రోజు కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరం అమిత్ షాతో ఆడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే చిదంబరం మీద లుక్ ఔట్ నోటీసులు జారీ కావడంతో మొబైల్ స్వీచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.