కబీర్ దాస్ సమాధి వద్ద టోపీ ధరించేందుకు తిరస్కరించిన యోగీ
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కబీర్ దాస్ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వారు టోపీ ధరించాల్సిందిగా యోగీని కోరగా ఆయన తిరస్కరించారు. ఉత్తర్ ప్రదేశ్లో సమాధిని ప్రధాని మోడీ సందర్శించాల్సి ఉన్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పరిశీలించేందుకు యోగీ ఆదిత్యనాథ్ సమాధి దగ్గరకు వెళ్లారు. అదే సమయంలో అక్కడ వార్డెన్గా ఉన్న ఖాదిమ్ హుస్సేన్ సీఎంకు టోపీ ఇవ్వగా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించడం కెమెరాల కంటికి చిక్కింది.
సంప్రదాయంలో భాగంగానే తాను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్కు టోపీని ఇచ్చినట్లు చెప్పిన ఖాదిమ్ హుస్సేన్... అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించాడు. టోపీని ధరించేందుకు నిరాకరించిన సీఎం...ఆ టోపీని తనతో పాటే తీసుకెళ్లారని ఖాదిమ్ తెలిపాడు. 2011లో కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో ఓ మసీదుకు చెందిన మతగురువు ముస్లింలు ధరించే టోపీని బహూకరించగా... మోడీ తిరస్కరించాడు. అప్పట్లో ఇది పెద్ద వార్తగా నిలిచింది. అంతేకాదు మోడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలను ఒకేలా చూడాలని విపక్షాలు ధ్వజమెత్తాయి.