బీజేపీ మేనిఫెస్టో ఒక భ్రాంతి : గతంలో ఇచ్చిన హామీలే విస్మరించారని మాయావతి ఫైర్
లక్నో : బీజేపీ మేనిఫెస్టోపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోని అమలుచేయని బీజేపీ మరోటి విడుదల చేసి ప్రజలను మోసం చేస్తోందని బీఎస్పీ అధినాయకురాలు మాయావతి విమర్శించారు.
వంచన
గత ఐదేళ్ల నుంచి బీజేపీ ప్రజలను మోసం చేసింది. మరో మరో మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. 2014లో ఇచ్చిన హామీలే నెరవేర్చని బీజేపీ .. ఇప్పుడేం చేస్తోందనే అంశంపై ప్రజలకు విశ్వాసం లేదన్నారామె. 2014-2019 వరకు బీజేపీ పెట్టుబడిదారుల కోసమే పనిచేసిందని విమర్శించారు మాయావతి.
కొందరికే అచ్చేదిన్
కొత్త మేనిఫెస్టో కాక గత ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ బీజేపీ ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో మోదీ చెప్పిన అచ్చేదిన్ కొందరికే వచ్చిందని విమర్శించారు. 130 కోట్ల మంది ప్రజలు ఇబ్బందిపడ్డారని గుర్తుచేశారు.
15 లక్షలేవీ ?
తమ బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు ఎప్పుడు జమవుతాయోనని ప్రజలు ఎదురుచూశారని .. కానీ వారి ఆశలను బీజేపీ సర్కార్ వమ్ము చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మేనిఫెస్టో ఒక భ్రాంతి లాంటిదని విమర్శించారు. ఆ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలు నిశీతంగా గమనించారని పేర్కొన్నారు.