ముంబై ఎయిర్పోర్ట్: అరుదైన రికార్డు, 24 గంటల్లో 969 విమానాల ల్యాండింగ్, టేకాఫ్
ముంబైలోని సహార్ ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నాడు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
ముంబై: ముంబైలోని సహార్ ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నాడు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 24 గంటల్లో ఒకే రన్ వే పై ఏకంగా 969 విమానాల రద్దీని నియంత్రించి అరుదైన రికార్డును సృష్టించారు.
విమానాలు ఇటీవల కాలంలో ప్రమాదాలు చోటు చేసుకొన్న ఘటనలను చూస్తున్నాం. అయితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా ఒకే రన్వేపై నుండి విమానాల ల్యాండింగ్, టేకాఫ్ను ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు సమన్వయం చేశారు.
అత్యంత పకడ్బందీ ప్లాన్తో అధికారులు విమానాల రాకపోకలను నియంత్రించారు. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ ప్రపంచ రికార్డును సృష్టించింది. 24 గంటల వ్యవధిలో సుమారు 969 విమానాలను ముంబై ఎయిర్పోర్టు రాకపోకలను నియంత్రించారు.
ముంబై ఎయిర్పోర్ట్ అరుదైన రికార్డ్
24 గంటల్లో ఒకే రన్ వే పై ఏకంగా 969 విమానాల రద్దీని నియంత్రించి ముంబై ఎయిర్ పోర్ట్ అరుదైన రికార్డును సృష్టించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సిబ్బంది సమన్వయం, ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని ఎయిర్ పోర్టు అథారిటీ వర్గాలు తెలిపాయి.శుక్రవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు ఒకే రన్వేపై 969 విమానాలను నియంత్రించారు ఎయిర్పోర్ట్ సిబ్బంది.
ఏటా పెరుగుతున్న విమానాల రాకపోకలు
2006 వరకు ముంబై విమానాశ్రయంలో గంటకు 30 విమానాల రాకపోకలు (టేకాఫ్, ల్యాండింగ్) ఏటీసీ సిబ్బంది నియంత్రించేవారు. ఆ తరువాత రెండేళ్లలో ప్రధాన రన్ వేలో మార్పులు, ఆధునిక రాడార్, ఇతర సాంకేతిక పరికరాలవల్ల ఈ సంఖ్య 52కు చేరింది. ఇదివరకు 24 గంటల్లో 852 విమనాలు రాకపోకలు సాగించినట్లు రికార్డులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు.
విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ఎప్పుడో చెప్పలేం
శుక్రవారం రాత్రి మొదలుకుని శనివారం రాత్రి వరకు ఇలా 24 గంటల్లో 969 విమానాలను నియంత్రించినట్టు అధికారులు చెప్పారు. అయితే ఏ సమయంలో ఏ విమానం టేకాప్, ఏ విమానం ల్యాండింగ్ అయిందో చెప్పలేమంటున్నారు అధికారులు. ప్రతీరోజు రాకపోకలు సాగించే విమానాలకు తోడుగా ఎప్పుడైన అదనంగా విమానాల సంఖ్య పెరిగితే వాటిని నియంత్రించే సామర్ధ్యం తమ సిబ్బందికి ఉందని ఏటీసీ జనరల్ మేనేజరు ఆర్.కే.సక్సేనా పేర్కొన్నారు. నిర్వహణ పనుల కోసం ప్రతీరోజు రన్ వే ను ఒక గంటసేపు మూసి ఉంచాలనేది నియమాలున్నాయి. ఆ ప్రకారం 23 గంటల్లోనే 969 విమనాలను నియంత్రించి రికార్డు సృష్టించినట్లు స్పష్టమైతోందని ఆయన అన్నారు.
భారీ విమానాల ల్యాండింగ్, టేకాఫ్
ముంబై విమానాశ్రయంలో ప్రధాన రన్ వేపై ఏ-380 లాంటి భారీ విమానాలు టేకాప్, ల్యాండింగ్ చేసే సామర్థ్యం ఉంది. దీంతో ఈ రన్ వే కు క్యాట్-3 గ్రేడ్ లభించింది. గతంలో ఒక్కో విమానం ల్యాండింగ్ లేదా టేకప్ చేయడానానికి 60 సెకండ్లకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు 47-48 సెకండ్లు మాత్రమే సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.