కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ఒడిషా ప్రభుత్వం నిర్ణయం... ప్రోత్సాహకం కింద నగదు..!
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలో ఒడిషా ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే అలాంటి జంటలకు ప్రోత్సాహకం ఇవ్వాలన్న భావనతో ఓ కొత్త వెబ్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ ప్రోత్సాహకం పోర్టల్లో వివరాలను దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా ప్రభుత్వం అందజేయనుంది. ఈ పోర్టల్ పేరు సుమంగళ్. కులాంతర వివాహాలు చేసుకున్న వారి వివరాలను ఇక్కడ నమోదు చేసుకుంటే వారికి ప్రోత్సాహకం అందించడం ద్వారా సమాజంలో సామాజిక సామరస్యం ఏర్పడుతుందని సీఎం నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.
సుమంగళ్ పోర్టల్ను ఎస్టీ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ మరియు మైనార్టీస్ వెనకబడిన వర్గాల సంక్షేమశాఖలు రూపొందించాయి. 2018వరకు కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ.లక్ష నగదు ప్రోత్సాహకం ఇస్తుండగా దాన్నిప్పుడు రూ.2.5లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఈ నగదు మొత్తం ఏదైనా జాతీయ బ్యాంకులో జంటకు జాయింట్ ఖాతా కలిగి ఉన్నట్లయితే అందులోకి బదిలీ చేయబడుతుందని చెప్పారు. అయితే ఈ నగదును వివాహ జీవితం మూడేళ్లు ముగిసిన తర్వాతే విత్డ్రా చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఈ ప్రోత్సాహకం అందివ్వడం జరుగుతుందని ఒడిషా ప్రభుత్వం పేర్కొంది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో 543 జంటలు కులాంతర వివాహం చేసుకోగా వారికి ప్రోత్సాహకం కింద ప్రభుత్వం రూ.2.65 కోట్లు ఇచ్చింది. ఇక ఈ నగదు ప్రోత్సాహకం పొందాలంటే కులాంతర వివాహాలు చెల్లుబాటులో ఉండి వాటిని హిందూ వివాహ చట్టం కింద నమోదు చేయబడి ఉండాలి. పెళ్లి చేసుకుంటున్న ఇద్దరిలో ఎవరో ఒకరు ఎస్సీ కులానికి చెందిన వారై ఉండాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒకరు అగ్రకులానికి చెందిన వారై ఉండాలి మరొకరు దిగువ కులానికి చెందిన వారై ఉండాలి. అయితే ఈ ప్రోత్సాహకం తొలిసారి వివాహం చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రోత్సాహకం అందుకునేందుకు వితంతువులు కూడా అర్హులే. ఇక ప్రోత్సాహకం కింద వచ్చే నగదుతో భూమి కొనుగోలు చేయడం కానీ , వ్యాపారం చేసేందుకు కానీ వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Recommended Video
ఇదిలా ఉంటే ఒడిషా ప్రభుత్వం విద్యార్థుల కోసం కూడా మరో పోర్టల్ను ప్రారంభించింది. ఇంటిగ్రేటెడ్ ఒడిషా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్లో అర్హులైన విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.రాష్ట్రంలోని 8 శాఖలు విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్నాయి. దీని ద్వారా 11 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. వీరంతా దళితులు, గిరిజనులు, ఇతర వెనకబడిన వర్గాల వారై ఉండాలి.