మాయావతికి మైండ్ బ్లాక్: ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిక
రాజస్థాన్ : మాయావతికి గట్టి షాకిచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. రాజస్థాన్లో బీఎస్పీ టికెట్ పై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. ఏనుగు పై నుంచి దిగి హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఉదయ్పూర్వతి ఎమ్మెల్యే రాజేంద్ర గుడ్, నడ్బాయ్ ఎమ్మెల్యే జోగేంద్ర సింగ్ అవనా , వజీబ్ అలీ, లఖన్ సింగ్ మీనా, సందీప్ యాదవ్, మరియు దీప్చంద్ కేరియాలు ఉన్నారు.
రాష్ట్రాభివృద్ధికోసమే కాంగ్రెస్లోకి
రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో వీరు టచ్లో ఉన్నారు. ఇక మంగళవారం ఉదయం అసెంబ్లీ స్పీకర్ను కలిసి తామంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయనకు సమాచారం ఇచ్చారు. రాజస్థాన్లో చెలరేగుతున్న మత ఘర్షణలపై పోరాడుతూ అదే సమయంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ సుస్థిరత కోసం, రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలన్న కాంక్షతో కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలిపారు. అశోక్ గెహ్లాట్ అత్యుత్తమమైన ముఖ్యమంత్రి అని రాజస్థాన్కు ఈయనలాంటి సీఎం మరొకరు ఉండరని ఉదయ్పూర్వతి ఎమ్మెల్యే రాజేంద్ర గుడ్ చెప్పారు.
బయట నుంచి కాంగ్రెస్కు మద్దుత తెలపడం ఇబ్బందిగా ఉంది
బయట నుంచి కాంగ్రెస్కు మద్దతు తెలపడం తమకు చాలా ఇబ్బందికరంగా మారిందని అందుకే నేరుగా కాంగ్రెస్ పార్టీలోనే చేరినట్లు చెప్పారు నడ్బాయ్ నియోజకవర్గం ఎమ్మెల్యే జోగేంద్ర సింగ్ అవానా. ఒకవైపు కాంగ్రెస్కు బయట నుంచి మద్దతు ఇస్తూనే మరోవైపు పార్లమెంటులో పంచాయతీ ఎన్నికల్లో వారికి వ్యతిరేకంగా ఉండటం తమకు నచ్చడం లేదని చెప్పారు. దీంతో తమకు రాష్ట్రమే ముఖ్యమని భావించి కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు.
అసెంబ్లీలో 118కి చేరుకున్న కాంగ్రెస్ బలం
ఇదిలా ఉంటే గతేడాది రాజస్థాన్కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలో విజయం సాధించగా బీఎస్పీ 6 స్థానాల్లో విజయం సాధించింది. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్కు 12 మంది నుంచి మద్దతు ఉంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో ఈ 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ బలం 112కు చేరుకుంది. ఇక ఈ ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో హస్తం పార్టీ బలం 118కి చేరుకుంది.