న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్: త్రివర్ణం పతాకం రెపరెప: చరిత్రలో మొదటిసారిగా: ఏర్పాట్లు చకచకా..
న్యూయార్క్: దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో జాతీయ పతాకం రెపరెపలాడబోతోంది. మువ్వన్నెల పతాకం కనువిందు చేయబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన టైమ్స్్ స్క్వేర్లో మన దేశ జాతీయ పతాకం సగర్వంగా ఎగురవేయబోతోండటం చరిత్రలో ఇదే తొలిసారి. అమెరికాలోని భారతీయ సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఏ) ప్రతినిధులు దీనికి సంబంధించిన సన్నాహాలను పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎఫ్ఐఏకు చెందిన అధికారిక సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల భారతీయ సంఘాల సమాఖ్య ప్రతినిధులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి అవసరమైన అనుమతులను తీసుకుంటున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తాము చరిత్ర సృష్టించబోతున్నామని ఎఫ్ఐఏ ప్రతినిధులు వెల్లడించారు.
టైమ్స్ స్క్వేర్లో మువ్వన్నెల పతాకాన్ని ఎగుర వేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ రణధీర్ జైస్వాల్ను గౌరవ అతిథిగా ఆహ్వానించబోతున్నట్లు చెప్పారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యులు కావడానికి అమెరికన్ పౌరులు కూడా ఆసక్తిగా ఉన్నారని ఐఎఫ్ఏ ప్రతినిధులు తెలిపారు.
టైమ్స్ స్క్వేర్ ఐకనిక్గా భావించే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్పై జాతీయ పతకంలోని రంగులను డిస్ప్లే చేస్తామని, లేజర్ ద్వారా వాటిని ప్రతిఫలింపజేస్తామని వారు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు నుంచే దీనికి సంబంధించిన వేడుకలను తాము ప్రారంభిస్తామని తెలిపారు. టైమ్ స్క్వేర్లో జాతీయ పతాకాన్ని ఎగుర వేయడానికి స్థానిక అధికారులు సానుకూలంగా ఉన్నారని, అనుమతులు త్వరితగతిన మంజూరు అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్-అమెరికన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేస్తామని అన్నారు.