విప్లవాత్మకం: ఆర్మీలో మహిళా జవాన్ల నియామకం: నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ!
న్యూఢిల్లీ: రక్షణ మంత్రిత్వశాఖ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. సైన్యంలో మహిళలను నియమించుకోనుంది. మహిళా జవాన్ల కోసం దరఖాస్తులను అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు తమ పేర్లను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవాలంటూ భారతీయ ఆర్మీ గురువారం నోటిఫికేషన్ ను జారీ చేసింది. సైన్యంలో సాధారణ విధుల్లో మహిళా జవాన్లను నియమిస్తారు. సరిహద్దుల్లో పహారా కాయడం, యుద్ధక్షేత్రంలో కాలు మోపడం వంటి విధులను కాకుండా.. సాధారణ కార్యకలాపాల కోసం మహిళా జవాన్లకు అవకాశం కల్పిస్తారు. తొలిదశలో 800 మందిని మహిళలకు జవాన్లుగా నియమించుకోనున్నారు.
మహిళలకు కూడా సైన్యంలో పనిచేసే అవకాశం కల్పిస్తామని అంటూ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహిళల నియామకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తూ వచ్చారు సైన్యాధికారులు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. నియమ, నిబంధనలకు తుది రూపాన్ని ఇచ్చారు. రక్షణ మంత్రి అనుమతి కోసం పంపించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే- నిర్మలా సీతారామన్.. ఈ ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.
మహిళా జవాన్ల విధులపై మరికొంత కసరత్తు పూర్తి చేసిన తరువాత..నియామక నోటిఫికేషన్ ను జారీ చేశారు. గురువారం (ఏప్రిల్ 25వ తేదీ) నుంచి సైన్యంలో జవాన్లుగా చేరడానికి ఆసక్తి గల మహిళలు భారతీయ ఆర్మీ వెబ్ సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ ద్వారా పేర్ల నమోదుకు చివరి తేదీ జూన్ 8. సాధారణంగా- మహిళలను ఆఫీసర్ ర్యాంక్ స్థాయిలో నియమించుకోవడం ఆనవాయితీ. దీనికి భిన్నంగా జవాన్ల స్థాయిలో మహిళలను నియమించుకోబోతుండటం ఆర్మీలో ఇదే తొలిసారి.