కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్...రాఫెల్ కేసులో మరోసారి విచారణకు ఓకే
Recommended Video
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు కేంద్రానికి షాక్ తగిలింది. దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ కేసుకు సంబంధించి దాఖలైన రివ్యూ పిటిషన్లపై అభ్యంతరం తెలుపుతూ విచారణ చేయరాదని కోరుతూ కేంద్రం మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం మాత్రం వాటన్నిటినీ విచారణ చేస్తామని పేర్కొంది. అంతేకాదు రాఫెల్కు సంబంధించి లీకైన డాక్యుమెంట్ల ఆధారంగా కూడా విచారణ చేస్తామని పేర్కొంది. రివ్యూ పిటిషన్లను విచారణ చేస్తామని ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏకగ్రీవంగా తెలిపింది.
ఇజ్రాయిల్ ఎన్నికలు: నెతన్యాహు మళ్లీ ప్రధాని అవుతారా.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి..?
అఫిడవిట్ దాఖలు చేసిన రక్షణశాఖ
కేసును విచారణ చేస్తున్న వారిలో ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లు ఉన్నారు. అంతకుముందు రక్షణ శాఖ ఓ అఫిడవిట్ను దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్లు వేస్తూ వాటికి అటాచ్ చేసిన డాక్యుమెంట్లు బహిర్గతం అవుతే దేశభద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉంటుందని పేర్కొంటూ రక్షణశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. రక్షణ శాఖ అభ్యర్థనను కేంద్రం తోసిపుచ్చింది.
కేసు పూర్వపరాలు
డిసెంబర్ 2018లో రాఫెల్కు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చింది. రాఫెల్ ఒప్పందంలో భాగంగా ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నీ సక్రమంగానే జరిగాయంటూ న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు ధరల విషయంలో కోర్టు జోక్యం చేసుకోబోదని కూడా నాడు స్పష్టం చేసింది. ఇక ముఖేష్ అంబానీ కంపెనీ దసాల్ట్ ఆఫ్సెట్ పార్ట్నర్గా పెట్టుకోవడంపై కూడా కోర్టు తప్పుబట్టలేదు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్షించాలని కోరుతూ కొందరు పిటిషనర్లు రివ్యూ పిటిషన్ను దాఖలు చేశారు. విచారణను కోర్టు రిజర్వ్లో ఉంచింది. బుధవారం కోర్టు దీన్ని విచారణ చేపట్టింది. రక్షణశాఖ సమర్పించే డాక్యుమెంట్లను కూడా కోర్టు పరిగణిస్తుందంటూ వెల్లడించింది. రాఫెల్కు సంబంధించి లీకైన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తామని పేర్కొంది.
సుప్రీం ఏకగ్రీవ తీర్పుపై కాంగ్రెస్ స్పందన
సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పుపై రాఫెల్ కేసులో ప్రధాన పిటిషనర్గా ఉన్న అరుణ్ శౌరీ సంతోషం వ్యక్తం చేశారు. రాఫెల్ ఒప్పందంలో కచ్చితంగా అవకతవకలు జరిగాయంటూ వాటిని ధృవీకరిస్తూ కొన్ని డాక్యుమెంట్లను అటాచ్ చేస్తూ పిటిషనర్ పిటిషన్ వేశారు. ఇక సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ కూడా స్పందించింది. మోడీ ఎన్నైనా అబద్ధాలు చెప్పొచ్చు... ఇందుకోసం ఎందాకైనా వెళ్లొచ్చు కానీ ఏదో ఒకరోజు నిజం అనేది బయటకొస్తుంది అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. రాఫెల్కు సంబంధించి ఒక్కొక్కటీ బయట పడుతోందంటూ ట్వీట్ చేశారు. ఇక అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనేది ఎందుకు పనికిరాదని సూర్జేవాలా ఎద్దేవా చేశారు. జర్నలిస్టులు కుంభకోణం బయటపెడితే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ద్వారా వారిపై చర్యలు తీసుకుంటానని బెదిరించాడని మోడీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. "మోడీ గారు ఇబ్బంది పడకండి... విచారణ జరుగుతుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా విచారణ జరుగుతుంది అసలు నిజాలు బయటికి వస్తాయి" అని రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.