రెండ్రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు.. ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ
తిరువనంతపురం: కేరళను తొలకరి చినుకులు జూన్ 8న పలకరించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జూన్ 8న కేరళ తీర ప్రాంతాన్ని రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర తీరం నుంచి కేరళ వైపు ఈ పవనాలు పయనిస్తాయని వెల్లడించింది. ఈ పరిస్థితులన్నీ నైరుతీ రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే నైరుతీ రుతు పవనాలు కేరళ తీరాన్ని ఒకవారం రోజులు ఆలస్యంగా తాకుతున్నాయని చెప్పారు. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళలోకి ప్రవేశించి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవడం ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇక రాష్ట్రంలోకి ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినందున ఈ ప్రభావం దక్షిణ రాష్ట్రాలు ఇతర మధ్యభారత రాష్ట్రాలపై కనిపిస్తుందని వెల్లడించారు.
జూన్ 9 నాటికి కేరళ కర్నాటక తీరంలో అల్పపీడనంగా మారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని అంచనా వేసింది వాతావరణ శాఖ . అదేసమయంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఇది ఉత్తర కేరళలో కనిపిస్తుందని అంచనా వేశారు.
ఇక జూన్ 9 నుంచి కొల్లాం, అలపుజాలో నారింజ రంగు అలర్ట్ను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక నైరుతీ రుతుపవనాలు విస్తరించగానే ఎల్లో అలర్ట్ను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షాలు కురుస్తాయని సంకేతమని అధికారులు తెలిపారు. మరోవైపు కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పలు జిల్లాల్లో ఇప్పటికే ఆరంజ్ అలర్ట్ను జారీ చేసింది. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో జూన్ 10న అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, అలపుజా, ఎర్నాకులం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే ఐదు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేయడం జరిగింది.