అక్కడ బీజేపీని ఓడించాలంటే.. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు పెట్టుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన ఢిల్లీలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ మధ్య సీట్లు బేరాలు బెడిసి కొట్టిన తరువాత.. నెలకొన్న రాజకీయ పరిణామాలు రెండు పార్టీలను అంతర్మథనంలో పడేశాయి. తమ ఉమ్మడి శతృవును దెబ్బకొట్టాలంటే- పొత్తులే శరణ్యమని భావిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు కోసం మరోసారి ఆప్-కాంగ్రెస్ మధ్య చర్చలకు దారి తీసే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. దీనికి కారణం- ఈ రెండు పార్టీలు కలిస్తే.. వచ్చే ఓట్ల శాతం.. బీజేపీని మించి పోవడమే.
శతృవుకు శతృవు మిత్రుడు అవుతాడనేది రణనీతి. ప్రస్తుతం కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే వ్యూహాన్ని ఢిల్లీలో అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆప్ తో సీట్ల సర్దుబాటు వ్యవహారం అర్ధంతరంగా ముగిసిన తరువాత.. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఓ సర్వే చేయించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 35 శాతం ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్ కు 22, ఆప్ కు 28 శాతం మేర ఓటుబ్యాంకు ఉన్నట్లు తేలింది.
కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ లబ్ది పొందుతుందనేది ఈ సర్వే సారాంశం. ఈ సర్వే అనంతరం- కాంగ్రెస్, ఆప్ తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 35 శాతం ఓటు బ్యాంకు ఉండగా.. కాంగ్రెస్, ఆప్ ఉమ్మడిగా పోటీ చేయడం వల్ల ఈ రెండుపార్టీలకు పడే ఓట్ల శాతం 50కి చేరుకుంటుంది. కాంగ్రెస్-ఆప్ పొత్తును అయిదుశాతం మంది వ్యతిరేకిస్తూ.. బీజేపీ వైపు మొగ్గు చూపినప్పటికీ.. తమదే పైచేయి అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
మీరు సూటుబూటు వేసుకున్న వారికే కాపలాదారుడు: మోడీకి కాంగ్రెస్ కౌంటర్
ఈ నేపథ్యంలో మరోసారి ఆప్ తో పొత్తు కోసం ప్రయత్నించాల్సిందేనని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూచిస్తున్నారు. ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయంపై పునరాలోచన చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఆప్ తో పొత్తును ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ సైతం.. ఈ సర్వే అనంతరం పునరాలోచనలో పడ్డట్టు చెబుతున్నారు.
ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఢిల్లీలో మాత్రమే కాకుండా.. హర్యానాలోనూ ఆప్ తో పొత్తు పెట్టుకుని లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ సీనియర్లు నిర్ణయించారు. దీనిపై రాహుల్ గాంధీ తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలు ఉండగా.. 2014 ఎన్నికల్లో అన్ని చోట్లా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చ ఎన్నికల్లో ఈ ఏడింట్లో ఆప్.. అయిదు స్థానాల్లో పోటీకి దిగుతూ, కాంగ్రెస్ కు రెండు సీట్లను కేటాయించింది. తమకు మూడు స్థానాలు కావాలంటూ రాహుల్ గాంధీ పట్టుబట్టడంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం బెడిసి కొట్టిన విషయం తెలిసిందే.