వాటికి సంబంధించిన యాడ్స్ను నిలిపివేయండి..మమత సర్కార్కు కోల్కతా హైకోర్టు షాక్
కలకత్తా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు షాకిచ్చింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు మమతా. ఈ క్రమంలోనే బెంగాల్ ప్రభుత్వం ఎన్ఆర్సీ సీఏఏలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్న నేపథ్యంలో హైకోర్టు సీరియస్ అయ్యింది.
బీజేపీపై పోరాటం చేసేందకు సీపీఐ, కాంగ్రెస్ కలిసి రావాలి: మమత బెనర్జీ
సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ప్రకటనలు
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వరాదని ఆదేశాలు జారీచేసింది. జనవరి 9వ తేదీకి కేసును వాయిదా వేసింది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మమతా సర్కార్ పలు మాధ్యమాల ద్వారా ప్రకటనలు ప్రచురితం చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు వీటికి బ్రేక్ వేస్తూ ఆదేశాలు ఇచ్చింది. భారత పౌరసత్వ చట్టం అనే అంశంపై రాష్ట్రప్రభుత్వాల జోక్యం ఉండరాదని, అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా చెప్పలేదు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఢిల్లీలో జరిగిన ర్యాలీలో ఎన్ఆర్సీపై స్పష్టత ఇచ్చారు. తమ ప్రభుత్వం ఎన్ఆర్సీపై ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదనే క్లారిటీని మెయిన్టెయిన్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అస్సాంలో ఎన్ఆర్సీ ప్రక్రియను కేంద్రం చేపట్టిందని గుర్తుచేశారు ప్రధాని మోడీ.
సీఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా మమతా నిరసనలు
పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలులోకి వచ్చినప్పటి నుంచి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అదే సమయంలో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ చాలా మంది విద్యార్థులు, ప్రజలు రోడ్డెక్కారు. నిరసనలు తెలిపారు. ప్రభుత్వం చట్టంను అమలు చేయరాదంటూ నినదించారు. ఈ సందర్భంగా పలు చోటు ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇక ఢిల్లీలో ప్రధాని చెప్పిన మాటలపై మమతా మండిపడ్డారు. ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారని, దీనిపై వ్యతిరేకత రాగానే ప్రధాని మోడీ ఎన్ఆర్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాట మార్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలోనే ప్రజలు డిసైడ్ చేస్తారు
తను ఏది మాట్లాడినా ప్రజల ముందు లేదా ప్రజావేదికలపైనే మాట్లాడుతానని, అదే ప్రధాని మాట్లాడితే ప్రజలే నిర్ణయిస్తారని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. మోడీ అమిత్ షాలు కలిసి దేశ ప్రాథమిక భావజాలంను విభజిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు సూటిగా సరిగ్గా మాట్లాడుతున్నారో, ఎవరు అడ్డంగా మాట్లాడుతున్నారో అనేది త్వరలోనే ప్రజలు నిర్ణయిస్తారని దీదీ ట్వీట్ చేశారు.
మమతా ఎందుకు అలా మారారు: ప్రధాని మోడీ
అక్రమ వలసదారుల గురించి ఢిల్లీలో మాట్లాడిన ప్రధాని మోడీ మమతాపై నిప్పులు చెరిగారు. కేవలం ఓట్ల కోసమే మమతా అక్రమ వలసదారులను వెనుకేసుకొస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. అసలు మమతా బెనర్జీ ఎందుకిలా మారారో తనకు అర్థం కావడం లేదని ప్రధాని అన్నారు. ఎన్నికలు, అధికారం వస్తుంటాయి పోతుంటాయని చెప్పిన ప్రధాని మోడీ.. ఎందుకు భయపడుతున్నారని మమతా బెనర్జీని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండంటూ హితవు పలికారు.