అయోధ్యలో తమ స్థలంలో మసీదు నిర్మాణానికి ఆలయ ట్రస్ట్ అంగీకారం
అయోధ్య: అయోధ్యలోని శిథిలావస్థలో ఉన్న మసీదు నిర్మాణానికి హిందువులు ముందుకు వచ్చారు. మూడు వందల ఏళ్ళనాటి ఆలంగిరి మసీదు పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు స్థానిక పురపాలక సంఘం నోటీసులు ఇచ్చింది. దీనిలోనికి ఎవరూ ప్రవేశించవద్దని చెప్పింది.
మొఘలు చక్రవర్తి ఔరంగజేబు అనుమతితో పదిహేడో శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారు. ఈ మసీదు ప్రాంతం.. హనుమాన్గర్హి దేవాలయ స్వాధీనంలో ఉంది. ఈ మసీదు శిథిలావస్థలో ఉండటంతో చాలాకాలం నుంచి ఇక్కడ నమాజు జరగడం లేదు.
స్థానిక ముస్లీంలు హనుమాన్గర్హి దేవాలయం ప్రధాన పూజారి మహంత్ జ్ఞాన్ దాస్ను కలిశారు. మసీదు పునర్నిర్మాణానికి సహకరించాలని కోరారు. దీంతో ఆలయ ట్రస్ట్ ఈ ఆలయం సమీపంలో దానిని పునర్ నిర్మించాలని నిర్ణయించారు.
పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చులను భరిస్తామని దేవాలయం ట్రస్ట్ తెలిపింది. మహంత్ మాట్లాడుతూ.. మసీదును పునర్నిర్మించుకోవచ్చునని, అందుకు అయ్యే ఖర్చులు భరిస్తామని ముస్లిం సోదరులకు చెప్పానని తెలిపారు. ఇది కూడా దేవుడి ఆలయమే కాబట్టి, నమాజు చేసుకొనేందుకు అభ్యంతరం లేదన్నారు. తాను రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తుంటానని చెప్పారు.