సెల్ఫీ తెచ్చిన తంటా : సినీతారతో ఫోటో కోసం ఎగబడితే కూలిన స్టేజీ
ఝార్గ్రామ్ : సెల్ఫీ పిచ్చి వింటుంటాం. చూస్తుంటాం. ప్రాణాలమీదకు తీసుకొచ్చిన ఘటనలు ఉన్నాయి. ప్రాణాలు పోయిన ఘటనలు మనకు తెలుసు. కానీ ఎన్నికల వేళ సినీతార కోసం సెల్ఫీ కోసం ఎగబడటంతో స్టేజీ కూలిన ఘటన పశ్చిమబెంగాల్లో జరిగింది.
తార దిగివచ్చిన వేళ
రాష్ట్రంలోని ఝార్గ్రామ్లో టీఎంసీ ప్రచారం నిర్వహిస్తోంది. తమ పార్టీ అభ్యర్థి తరఫున సినీతార సుశ్రత్ జహాన్ను రంగంలోకి దించారు. అసలే స్టార్ కాబట్టి ఆమెను చూడటానికి ఎగబడిన జనం .. ఒక్క ఫోటో కోసం స్టేజీ ఎక్కారు. ఇంతవరకు బానే ఉంది .. కానీ స్టేజీపై రష్ పెరగడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే .. ఆ స్టేజీ తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదం తప్పింది.
ఫోటో కోసం ఎగబడటంతో ...
టీఎంసీ అభ్యర్థి బీర్బహా సోరెన్ మద్దతుగా ప్రచారం చేసేందుకు సుశ్రత్ వచ్చారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. అయితే ఒక్కసారిగా అభిమానులు స్టేజీపైకి రావడంతో .. కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో నటి సుశ్రత్ కంగారుపడ్డారు. ఏమైందని ఆందోళన చెందారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో టీఎంసీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
బసిరత్ నుంచి బరిలోకి
సార్వత్రిక ఎన్నికల్లో సుశ్రత్ జహాన్ కూడా పోటీచేస్తున్నారు. బసిరత్ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరఫున బరిలో నిలిచారు. ఈ క్రమంలో తన పార్టీ నేత కోసం ప్రచారం చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది.