బెంగళూరు సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళతో ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ భేటీ, అధికార పార్టీకి చెక్ !
చెన్నై/ బెంగళూరు: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ వీకే. శశికళ తన కుటుంబ సభ్యులు స్థాపించిన ఏఎంఎంకే పార్టీని బలోపేతం చెయ్యడానికి సిద్దం అయ్యారు. సెంట్రల్ జైలు నుంచే ఏఎంఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలకు అనేక సూచనలు, సలహాలు ఇచ్చిన వీకే. శశికళ తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి చెక్ పెట్టే భాద్యతలను ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి, చెన్నైలోని ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కు అప్పగించారు.
సెంట్రల్ జైల్లో పక్కాప్లాన్ !
అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న చిన్నమ్మ వీకే. శశికళను ఏఎంఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కలిశారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాల గురించి టీటీవీ దినకరన్ తన సమీన బంధువు వీకే. శశికళకు వివరించారు. తమిళనాడులో మళ్లీ తమ ప్రభావం చూపించడానికి శశికళ, టీటీవీ దినకరన్ పక్కాప్లాన్ వేస్తున్నారని సమాచారం.
శశికళ అండ్ కో ఔట్
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వీకే. శశికళ తన సమీప బంధువు, ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ తో ఏఎంఎంకే పార్టీని స్థాపించారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళతో పాటు టీటీవీ దినకరన్, వారి బంధువులు, వారి మద్దతుదారులను గతంలో బహిష్కరించారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నాయకులు అందరూ ప్రస్తుతం టీటీవీ దినకరన్ వెంట ఉన్నారు.
లీడర్స్ కు సలహాలు
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నాయకులు అందరూ ఇప్పుడు ఏఎంఎంకే పార్టీలో కొనసాగుతున్నారు. కొంత కాలంగా ఏఎంఎంకే పార్టీ కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయి. ఏఎంఎంకే పార్టీలోని నాయకులు వారివారి జిల్లాల్లో చురుకుగా పార్టీ కార్యకలాపాలు కొనసాగించాలని, కార్యకర్తలతో సన్నిహితంగా ఉండేలా చూడాలని శశికళ టీటీవీ దినకరన్ కు సూచించారని తెలిసింది.
మన్నార్ గుడి ఫ్యామిలీ !
తమిళనాడులో వీకే శశికళ కుటుంబ సభ్యులను మన్నార్ గుడి ఫ్యామిలీ అని పిలుస్తుంటారు. అయితే శశికళ కుటుంబ సభ్యుల్లో ఒకరిని చూస్తే ఒకరికి కాదు. ఈ విషయంలో చూసిచూడనట్లు పోవాలని, అందరిని ఏఎంఎంకే పార్టీ గూటికిచేరేలా చూడాలని టీటీవీ దినకరన్ కు శశికళ సూచించారని సమాచారం. మనం అందరూ కలిసి ఉంటేనే తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీని ఎదిరించడానికి అవకాశం ఉంటుందని టీటీవీ దినకరన్ కు శశికళ చెప్పారని వారి సన్నిహితులు అంటున్నారు.
ఎన్నికలు టార్గెట్
తమిళనాడులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఎంపిక చేసి బరిలోకి దింపేలాచూడాలని టీటీవీ దినకరన్ కు శశికళ సూచించారని సమాచారం. తమిళనాడులోని అన్ని జిల్లాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటే మంచి, లేదా ఒంటరిగా పోటీ చెయ్యాలా అనే విషయంలో శశికళ, టీటీవీ దినకరన్ చర్చించారని తెలిసింది. మొత్తం మీద జైల్లో నుంచే వీకే. శశికళ ఏఎంఎంకే పార్టీని బలోపేతం చెయ్యడానికి టీటీవీ దినకరన్ కు అనేక సూచనలు సలహాలు ఇస్తున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.