అయోధ్య వివాదానికి త్వరలో పరిష్కారం: శ్రీశ్రీ, 'కోర్టు ద్వారానే'
అయోధ్యలో రామమందిర వివాదంపై సంచలన పరిణామం చోటుచేసుకుంది. త్వరలోనే ఈ వివాదం పరిష్కారమయ్యే అవకాశముందని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవి శంకర్ వెల్లడించారు.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర వివాదంపై సంచలన పరిణామం చోటుచేసుకుంది. త్వరలోనే ఈ వివాదం పరిష్కారమయ్యే అవకాశముందని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవి శంకర్ వెల్లడించారు.
ఈ వివాద పరిష్కారంలో తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వివాదంతో ముడిపడిన వర్గాలతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలున్నాయన్నారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వుకు ముందే కూర్చుని చర్చించుకుని వివాదాన్ని పరిష్కరించుకోవడమే ఉత్తమమైన మార్గమైన ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరు మతాల వారికి ఇదే చక్కటి అవకాశమని, కోర్టు సూచించే పరిష్కారం ఎలాగైనా ఉండవచ్చునని, అయితే అంతవరకూ వేచిచూస్తే మనం మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నట్టు అవతుందన్నారు.
ఎన్నో ఏళ్లుగా ఈ వివాదం అపరిష్కృతంగా ఉన్నందున సాధ్యమైనంత త్వరలో సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. ఆయన నిర్మోహి అఖారా, ముస్లీం లాబోర్డు సభ్యులను కలిసినట్లు తెలిపారు.
శ్రీశ్రీ మధ్యవర్తిత్వాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కోర్టు బయట జరుపుతున్న చర్చల్లో భాగంగా అక్టోబర్ 6న బెంగళూరుకు రావాల్సిందిగా నిర్మోహి అఖాడా, ఏఐఎంపీఎల్బీ సభ్యులను రవిశంకర్ ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఏఐఎంపీఎల్బీ న్యాయవాది జఫర్యాబ్ జిలానీ తోసిపుచ్చారు.
బోర్డు అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, వ్యక్తిగతంగా ఎవరైనా ఏదైనా చేస్తే అది ఆల్ ఇండియా ముస్లిం పెర్సనల్ లా బోర్డు వైఖరి కాదని జిలానీ వివరించారు. కోర్టు ద్వారానే కానీ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కుదరని బోర్డు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పిందన్నారు.