భారత్కు మరో భారీ విజయం, ‘బ్రిక్స్’లో పాకిస్తాన్ కు మొట్టికాయలు, కలిసొచ్చిన చైనా!
దౌత్యపరంగా డోక్లాం ప్రతిష్టంభనకు తెరదించిన భారత్కు కొద్దిరోజుల్లోనే అంతర్జాతీయ వేదికపై మరో భారీ విజయం లభించింది.
న్యూఢిల్లీ: దౌత్యపరంగా డోక్లాం ప్రతిష్టంభనకు తెరదించిన భారత్కు కొద్దిరోజుల్లోనే అంతర్జాతీయ వేదికపై మరో భారీ విజయం లభించింది. పాకిస్తాన్ గురించి ప్రస్తావించకుండానే ప్రధాని మోడీ దాయాది దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి దోషిగా నిలబెట్టారు.
చైనా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల డిక్లరేషన్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తొయిబా పేర్లను కూడా చేర్చారు. మోడీ ప్రస్తావించకుండానే బ్రిక్స్ వేదికపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ప్రకటించడమే ఆశ్చర్యమే!
ఉగ్రవాదానికి పాకిస్తాన్ పుట్టిల్లు...
గతేడాది గోవా వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో పాకిస్తాన్పై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ‘ఉగ్రవాదానికి పాకిస్తాన్ పుట్టిల్లు..' అంటూ అప్పట్లో మోడీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా చైనాలోని జియామెన్ లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులోనూ పాకిస్తాన్కు మొట్టికాయలు పడడం విశేషం.
ఆ ప్రస్తావనే తేవద్దన్న చైనా...
బ్రిక్స్ వేదికపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ప్రస్తావించవద్దని కొద్ది రోజుల కిందట భారత్ను చైనా కోరిన విషయం తెలిసిందే. బ్రిక్స్ సమావేశాల్లో ఉగ్రవాద నిర్మూలనలో పాకిస్తాన్ పాత్ర గురించి చర్చించడానికి తాము అభ్యంతరం వ్యక్తం చేస్తామని చైనా పేర్కొంది. గోవా బ్రిక్స్ సమావేశం మాదిరిగానే ఇక్కడ కూడా ప్రధాని మోడీ పాకిస్తాన్ అంశాన్ని లేవనెత్తుతారేమోననే అనుమానంతో ఉగ్రవాదానికి కొమ్ము కాస్తుందనే అంశాన్ని బ్రిక్స్ సమావేశంలో చర్చించవద్దని ప్రధానికి విన్నవించింది.
ఆ అంశానికి అంత ప్రాధాన్యం లేదు...
భారత్ దృష్టి నుంచి చూస్తే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పెద్ద సమస్యే అయిఉండొచ్చు కానీ బ్రిక్స్ దేశాల దృష్టి నుంచి ఆ అంశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగ ప్రతినిధి హూ చున్యింగ్ తెలిపారు. అంతేకాదు పాకిస్తాన్ ప్రస్తావన తీసుకురావడం వల్ల సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రధాని ప్రస్తావించకుండానే...
మన ప్రధాని మోడీ ప్రస్తావించకుండానే బ్రిక్స్ వేదికపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ప్రకటించడం భారత్ కు చారిత్రాత్మక విజయమే! చైనా... తాజాగా తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ చైనాయే.. జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మహ్మద్ సయీద్పై ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడకుండా కాపాడుతూ వచ్చింది.
కానీ ఇప్పుడు అదే చైనా.. జైషే మహ్మద్, లష్కరే తొయిబా ఉగ్ర మూకల కారణంగా పెచ్చరిల్లుతున్న హింసను ఖండించింది. లష్కరే తొయిబా, జైషే మహ్మద్లతో పాటు తాలిబన్, ఐఎస్ఐఎల్, అల్ ఖైదా, హక్కానీ తదితర ఉగ్రసంస్థల హింసపైనా బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.