ఒకవైపు వడగాలులు.. మరోవైపు మెదడువాపు రోగులు.. బీహార్లో పిట్టల్లా రాలుతున్న జనం..
పాట్నా : బీహార్లో పరిస్థితులు దారుణంగా మారాయి. మండే ఎండలు ఒకవైపు.. ప్రబలుతున్న వ్యాధులు మరోవైపు ప్రజల ప్రాణాలు కబళిస్తున్నాయి. వడగాలులకు ఇప్పటి వరకు 40 మంది వరకు మృత్యువాతపడడ్డారు. మరోవైపు మెదడువాపు వ్యాధి లక్షణాలతో బాధపడుతూ ప్రాణాలొదిలిన చిన్నారుల సంఖ్య 80కి చేరింది. ఈ పిల్లల మరణాలు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కన్నతండ్రే కాలయముడు.. పెళ్లి చేసుకోను అన్నందుకు..
వడదెబ్బకు 40 మంది మృతి
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఊరించి ఉసూరుమనిస్తున్నాయి. జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. ఆ తర్వాతైనా వేగంగా విస్తరిస్తాయనుకున్న వారి ఆశలు అడియాశలే అయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఉక్కపోత, వడగాలుల కారణంగా బీహార్లో ఇప్పటి వరకు 40మంది చనిపోయారు. ఒక్క ఔరంగాబాద్లోనే 27మంది ప్రాణాలొదిలారు. ఎండదెబ్బకు గయలో 12, నవడాలో మరొకరు కన్నుమూశారు.
ఆగని చిన్నారుల మరణాలు
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో మెదడువాపు వ్యాధి లక్షణాలతో మృత్యువాత పడుతున్న చిన్నారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు దీని కారణంగా చనిపోయినవారి సంఖ్య 80కి చేరినట్లు శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ చెప్పారు. మరణించిన చిన్నారులతా పదేళ్లలోపు వారేనని అన్నారు. ప్రస్తుతం శ్రీకృష్ణ మెడికల్ కాలేజీలో 197మంది, ఓ స్వచ్చంధ సంస్థ నిర్వహిస్తున్న కేజ్రీవాల్ హాస్పిటల్లో 91 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధి లక్షణాలతో చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇది మెదడువాపు వ్యాధి కాదని, హైపో గ్లెసిమియా అని డాక్టర్లు చెబుతున్నారు. రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారని అంటున్నారు.
రూ.4లక్షల పరిహారం
మృత్యువాతపడిన చిన్నారుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. చనిపోయిన చిన్నారుల తల్లిదండ్రులకు రూ.4 లక్షలు పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు వడదెబ్బ కారణంగా పలువురు చనిపోవడంపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు మెదడు పనితీరుపై ప్రభావం చూపడమేకాకుండా పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని హర్షవర్థన్ ెచప్పారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.