ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ : మోడీ
కోయంబత్తూరు : సార్వత్రిక ఎన్నికల్లో రెండుసారి ఘన విజయమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రసంగం మధ్య తరగతి ప్రజల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా సాగింది. అన్నాడీఎంకేతో కలిసి నిర్వహించిన ఈ సభలో ప్రధాని శబరిమల అంశం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాస్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్
బీజేపీ దాని మిత్రపక్షం అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కోయంబత్తూరులో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 1998 కోయంబత్తూరు పేలుళ్ల అంశాన్ని ప్రస్తావించిన మోడీ.. ఈ విషయంలో డీఎంకే అనుసరించిన వైఖరిని తప్పుబట్టారు. ఎన్డీఏ కూటమి జాతీయ భద్రతకు ప్రాధాన్యమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో తలపెట్టిన డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్టు ద్వారా పలువురికి ఉపాధి లభిస్తుందని అన్నారు.
జీఎస్టీలో మార్పులు
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్ కారణంగా కోయంబత్తూర్, తిరుప్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని జీఎస్టీలో చాలా మార్పులు చేశామని చెప్పారు. చిన్న, మధ్యతరహ పరిశ్రమలతో పాటు టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారు.
మలయాళీ ఓటర్లకు గాలం
తమిళనాడులో ఉన్న మలయాళీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాని మోడీ శబరిమల అంశాన్ని ప్రస్తావించారు. శబరిమలలో మహిళల ప్రవేశంపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వైఖరిని తప్పుబట్టారు. ఈ విషయంలో రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కేరళ ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా వారి సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మోడీ ఆరోపించారు. కేరళ ప్రజలకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మధ్య తరగతిని విస్మరించిన కాంగ్రెస్
కాంగ్రెస్ మేనిఫెస్టోలో మధ్య తరగతి ప్రజల్ని పూర్తిగా విస్మరించిందని మోడీ విమర్శించారు. కాంగ్రెస్తో పాటు డీఎంకే కూడా ఏనాడు మిడిల్ క్లాస్ గురించి పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్, డీఎంకే అధికారంలోకి వస్తే పన్నుల రూపంలో ప్రజలపై మరింత భారం మోపుతారని ఆరోపించారు. మధ్య తరగతి ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుకు బీజేపీ రక్షణగా నిలుస్తుందని మోడీ హామీ ఇచ్చారు.
మహిళా వ్యతిరేకులు
డీఎంకే, కాంగ్రెస్లు మహిళా వ్యతిరేక పార్టీలు అని మోడీ విమర్శించారు. సంకుచిత మనస్తత్వం కలిగిన డీఎంకే జయలలిత పట్ల దారుణంగా వ్యవహరించిందని అన్నారు. అలాంటి పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు రక్షణ కల్పిస్తుందా అని ప్రశ్నించారు.