దారుణం: ఆవు మాంసం తింటున్నాడని కొట్టి చంపారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో మహమ్మద్ అఖ్లాక్ (50) అనే వ్యక్తి ఇంట్లో ఆవు మాంసాన్ని దాచి, అమ్మడంతో పాటు తింటున్నాడని ఆరోపణలు రావడంతో ఆందోళన కారులు దాడి చేసిన అతడిని కొట్టి చంపారు.
ఈ ఘటన ఢిల్లీకి 45 కిలోమీటర్ల దురంలో చోటు చేసుకుంది. దాద్రికి సమీపంలో నివసిస్తున్న మహమ్మద్ను, 22 ఏళ్ల అతడి కుమారుడిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి బిసారా గ్రామానికి చెందిన అల్లరిమూకలు అత్యంత దారుణంగా దాడి చేశారు.
ఈ దాడిలో మహమ్మద్ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. మహమ్మద్ కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా దాద్రి ప్రాంతంలో మటన్ దుకాణాన్ని నిర్వహిస్తోంది. అయితే వీరు ఆవుమాంసాన్ని నిల్వ చేసి ఉంచుతున్నారని ఆరోపిస్తూ కొంత మంది అల్లరిమూకలు దాడి చేశారు.
ఈ దాడిలో మహమ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయన కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
దాడి ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఇంట్లోని మాంసం నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. అల్లరి మూకలు చేసిన దాడిలో 20 ఏళ్ల ఓ వెల్డింగ్ వర్కర్ కూడా గాయపడ్డాడు.
ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. మహమ్మద్ అఖ్లాక్ కుమార్తె సజిదా మాత్రం తమ ఇంట్లోని ఫ్రిజ్లో మటన్ ఉందని ఆవు మాంసం కాదని పోలీసులు విచారణలో పేర్కొన్నారు.