11మంది డెత్ మిస్టరీ: డైరీలో నమ్మశక్యం కానీ అంశాలు, ఆత్మహత్యకు రిహార్సల్స్
Recommended Video
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడిన కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే భాటియా కుటుంబం ఈ ఘోరానికి పాల్పడటానికి గల కారణాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. మంగళవారం మరోసారి క్లూస్ టీం ఘటనా ప్రాంతాన్ని సందర్శించింది. భాటియా కుటుంబాన్ని రిషి అనే ఫుడ్ డెలివరీ బాయ్ చివరిసారి చూసినట్లుగా తెలుస్తోంది.
ఒకే ఫ్యామిలీలో 11మంది అనుమానాస్పద మృతి: హత్యలేనా?, డైరీలో ఏముంది? 'ఆ11 పైపులేంటీ?'
ఘటనకు కొద్ది గంటల ముందు ఆ ఇంట్లో అంతా సాధారణంగానే కనిపించిందని సదరు ఫుడ్ డెలివరీ బాయ్ వెల్లడించారు. ఆ రోజు రాత్రి పదిన్నర గంటల సమయంలో 20 రోటీల కోసం ఆర్డర్ చేశారని, పది నలభై ఐదు నిమిషాలకు డెలివరీ చేశామని, బాటియా కూతురు రోటీలు తీసుకొని, తనకు డబ్బులివ్వాలని తండ్రికి చెప్పిందని, ఆ సమయంలో అంతా సాధారణంగానే ఉందన్నారు. భాటియా కుటుంబానికి చెందిన 11 మంది కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం విగతజీవిలుగా కనిపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
పోలీసుల విచారణలో షాకింగ్ అంశాలు
ఈ సామూహిక ఆత్మహత్యల వెనుక గల కారణాలపై స్పష్టత రానప్పటికీ.. మోక్షం పొందడమే లక్ష్యంగా వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసుల దర్యాఫ్తులో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. భాటియా ఇంట్లో దొరికిన డైరీ ద్వారా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారని సమాచారం.
లలిత్ డైరీలో ఆశ్చర్యకర విషయాలు
మృతి చెందిన వారిలో లలిత్ భాటియా ఉన్నారు. అతను వృద్ధురాలు నారాయణ్ దేవి చిన్న కొడుకు. 45 ఏళ్ల లలిత్కు కొంతకాలం క్రితం ప్రమాదవశాత్తూ మాట పడిపోయింది. ఇటీవలే అతడు మెల్లిగా మాట్లాడగలుగుతున్నాడు. పోలీసులకు లలిత్కు చెందిన డైరీ లభించింది. దాని ద్వారా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ డైరీలో లలిత్.. పదేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి గురించి కలలు కన్నట్లుగా రాసుకున్నాడట.
తండ్రి నుంచి ఆదేశాలు వస్తున్నాయని
అందులో ఆస్తులు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతల వ్యవహారాలపై తన తండ్రి నుంచి ఆదేశాలు తీసుకున్నట్లు లలిత్ డైరీలో పేర్కొన్నారని తెలుస్తోంది. తన తండ్రి నుంచి తనకు ఆదేశాలు వస్తున్నాయని, ఇంట్లో అందరూ వాటిని పాటించాలని లలిత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మూడేళ్లుగా లలిత్ డైరీ రాస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జూన్ 25న చివరిసారి డైరీ రాసినట్లుగా ఉంది. దేవుడు కాపాడుతాడని అందులో లలిత్ రాసినట్లుగా తెలుస్తోంది.
ఆత్మహత్యలకు రిహార్సల్స్
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి ముందు రిహార్సల్స్ చేసినట్లుగా కూడా డైరీ ద్వారా తెలిసిందని సమాచారం. లలిత్ ఆరోగ్యం గురించి కంగారుపడవద్దని, తాను రావడం వల్లే అతడికి సమస్యలని లలిత్ తనకు తాను డైరీలో రాసుకున్నాడట. వీటిని చూస్తుంటే లలిత్ లలిత్ భ్రమల వల్లే ఈ ఆత్మహత్యలు జరిగినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆయన డైరెక్షన్ వల్లే ఈ ఆత్మహత్యలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు.