త్వరలో యూపీ క్యాబినెట్ విస్తరణ ? బెర్త్ దక్కెదెవరికో ?
లక్నో : ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోకస్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి .. మంచి ఊపుమీదున్న బీజేపీ, రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసింది.
గెలిచిన ముగ్గురు మంత్రులు
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ముగ్గురు మంత్రులు బరిలోకి దిగారు. వారు విజయం సాధించడంతో మంత్రివర్గ విస్తరణ అనివార్యమైంది. దీంతోపాటు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన మిత్రపక్ష నేత ఓం ప్రకాశ్ రాజ్బర్ స్థానంలో మరొకరిని తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం విశేషంగా కృషిచేసిన ఎమ్మెల్యేలకు పోర్టు పోలియో దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
రెండేళ్ల నుంచి జరగని విస్తరణ
రెండేళ్ల క్రితం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యూపీలో కొలువుదీరింది. అయితే అప్పటి నుంచి ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించలేదు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 62 మంది ఎంపీలను గెలిపించిన జోష్ లో ఉన్న బీజేపీ .. మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసుకుంటుంది. మంత్రివర్గ విస్తరణకు బీజేపీ హై కమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి పార్టీ కోసం పనిచేసిన నేతలకు క్యాబినెట్ బెర్త్ దక్కతుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే అభ్యర్థుల పేర్లను ఇంకా బీజేపీ కన్ఫామ్ చేయలేదని విశ్వసనీయంగా తెలిసింది. మరో రెండునెలల్లో యూపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ లోపే క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజేపీ విజయం
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలైంది. దీంతో పార్టీకి ఆదరణ కరవైందని ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే మోదీ, షా కూడా యూపీపై ఫోకస్ చేయలేదు. ఎస్పీ,- బీఎస్పీ ఒక్కటై పోటీచేసినా .. ప్రజలు మత్రం మరోసారి బీజేపీకే పట్టం కట్టారు. మళ్లీ 62 సీట్లు కట్టబెట్టి .. బీజేపీ ఓటుబ్యాంకు పడిపోలేదని నిరూపించాయి. దీంతో యూపీలో తిరిగి బీజేపీకి పునర్ వైభవం వచ్చిందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.