ఇది నిజం, ఇదే తొలిసారి: ఒడిశాలో పెట్రోల్ కంటే డీజిల్ ధరే ఎక్కువ! ఎందుకో తెలుసా?
భువనేశ్వర్: పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర తక్కువగా ఉండటం మనం నిత్యం చూస్తూ ఉంటాం. గతంలో పెట్రోల్ కంటే డీజిల్ ధర చాలా తక్కువగా ఉండేది. కానీ అంతర్జాతీయ మార్కెట్ కారణంగా డీజిల్ ధర కూడా పెట్రోల్ ధర సమీపానికి వచ్చింది.
మరికాస్త ఉపశమనం: ఐదో రోజూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
అయితే, ఒడిశాలో పెట్రోల్ ధర కంటే డీజిల్ ధరనే ఎక్కువగా ఉంది. ఇది నిజమే. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో డీజిల్ ధర రూ.80.69 ఉండగా, పెట్రోల్ ధర రూ.80.57 పైసలుగా ఉంది. డీజిల్ ధర పెట్రోల్ కంటే 12 పైసలు ఎక్కువగా ఉంది. ఇది ఆదివారం ధర.
ఇదే తొలిసారి
భువనేశ్వర్లో సోమవారం నాడు ఈ ధరలు పెట్రోల్ ధర రూ.80.27 పైసలు, డీజిల్ రూ.80.40 పైసలుగా ఉంది. అంటే 13 పైసలు పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉంది. పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారి అని ఉత్కల్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పేర్కొన్నారు.
డీజిల్ ధర ఎక్కువ ఉండటానికి కారణం ఇదే
పెట్రోల్, డీజిల్ పైన ఇతర రాష్ట్రాలు వేర్వేరు వ్యాట్లు విధిస్తున్నాయని, ఒడిసా మాత్రం రెండింటి పైన ఒకే రకంగా 26 శాతం వ్యాట్ను విధిస్తోందని ఆయన తెలిపారు. ధర ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో డీజిల్ విక్రయాలు తగ్గాయని తెలిపారు.
రెండు నెలలుగా ధర పెరుగుదల
పెట్రోలు, డీజిల్ ధరల మధ్య కేవలం పది శాతం తేడా ఉంటుందని ఆయన చెప్పారు. కానీ గత రెండు నెలలుగా పెట్రోల్ కంటే డీజిల్ పెరుగుదల శాతం ఎక్కువగా ఉందని చెప్పారు.
ఒడిశా మంత్రి ఆగ్రహం, బీజేపీ కౌంటర్
ఇదిలా ఉండగా, డీజిల్ ధర పెరుగుదలపై ఒడిశా ఆర్థిక మంత్రి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు విధానాల వల్ల ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఈ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. దేశంలో చాలా రాష్ట్రాలు చమురు పైన వ్యాట్ను తగ్గించాయని, ఒడిశా ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు.