విలీనం: ఏప్రిల్ 1 నుంచి విజయాబ్యాంకు దేనా బ్యాంకులు కనిపించవు
దేశంలో ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుబంధ బ్యాంకులు విలీనం అయిన సంగతి తెలిసిందే. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులు విలీనం అయ్యాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేనా బ్యాంకు, విజయాబ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీసీఐ బ్యాంకుల తర్వాత దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా బ్యాంక్ ఆఫ్ బరోడా గుర్తింపు పొందింది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయా బ్యాంకు విలీనం ఏప్రిల్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుంది. ఇలా మూడు వేర్వేరు బ్యాంకులు కలిసి ఒకే బ్యాంకుగా రూపాంతరం చెందడం భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఇదే తొలిసారి.
ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు విజయా బ్యాంకు విలీనంకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మీడియాతో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. ఇకనుంచి దేనా బ్యాంకు, విజయా బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులను బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలకు బదిలీ చేస్తామని వెల్లడించారు. విలీనం అయిన సందర్భంగా ఉద్యోగుల తగ్గింపు ఉండదని ఎంతమంది ఉద్యోగులైతే ప్రస్తుతం పనిచేస్తున్నారో అందరినీ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలకు బదిలీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.