ప్రాంతీయ పార్టీలతో బిజెపి కూటమి, మేఘాలయ కాంగ్రెస్ చేజారేనా?
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్రంలో రెండు సీట్లు మాత్రమే కైవసం చేసుకొన్న బిజెపి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగు వేస్తోంది.అయితే కాంగ్రెస్ పార్టీకి మేఘాలయలో 21 స్థానాలు దక్కాయి. మేఘాలయలో ఎన్పిపి 19 స్థానాలను కైవసం చేసుకొంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా బిజెపి చక్రం తిప్పుతోంది.
మేఘాలయలో ఎన్పీపీ నేతృత్వంలోని ఇతర పార్టీలను ఒక చోటుకు చేర్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపి పావులు కదుపుతోంది. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని ఎనిమిది స్థానాలు గెలిచిన యూడీపీ హెచ్ఎస్డిపీ బిజెపి ఏర్పాటు చేస్తున్న కూటమిలో చేరేందుకు ముందుకు వచ్చింది.
ఎన్పీపీ కి చెందిన కోనార్డ్ సంగ్మా తదుపరి మేఘాలయ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నట్టు సమాచారం. గోవా, మణిపూర్ తరహాలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినప్పటికీ మరోసారి మేఘాలయాలో ఆ పార్టీకి అధికారపీఠం దూరమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి.అయితే ఏం జరుగుతోందో వేచి చూడాలనే ఆసక్తి నెలకొంది.