డేంజర్ బెల్స్ : భారత్లో 77శాతం ఉద్యోగాలకు భద్రత లేదన్న IOL సర్వే
Recommended Video
2018లో భారత్లో నిరుద్యోగ రేటు 3.5శాతం వద్ద ఉంటుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. అదే మన పొరుగుదేశం చైనాలో నిరుద్యోగ రేటు 4.7 శాతం నుంచి 4.8 శాతానికి చేరుకోనుందని పేర్కొంది. భారత్లో ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడిపోయిందని చెప్పిన సంస్థ... 77శాతం ఉద్యోగాలకు భద్రత లేదని వివరించింది. ఈ సంఖ్య చైనాలో 33శాతంగా ఉంది.
"వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ ఔట్లుక్ - ట్రెండ్స్ 2018" పేరుతో అంతర్జాతీయ కార్మిక సంఘం రిపోర్ట్ను విడుదల చేసింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ ఆశావహంగానే ఉంటుందని చెప్పుకొచ్చింది. ప్రత్యేకించి భారత ఆర్థిక వ్యవస్థ 2018లో 7.4శాతానికి ఎగబాకే అవకాశముందని తేల్చింది. 2017లో ఈ సంఖ్య 6.7 శాతంగా ఉన్నింది. భారత ఆర్థిక వ్యవస్థ దక్షిణాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తోందంటూ నివేదిక వెల్లడించింది.
కొన్ని ప్రధాన రంగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నప్పటికీ... సేవారంగంలో ఉపాధి కల్పన గత రెండు దశాబ్దాలుగా భారీగా పడిపోయిందని తెలిపింది. ఉన్న ఉద్యోగాలకు కూడా భద్రత లేకుండా పోయిందని అభిప్రాయపడింది. సమాచారా లోపంతో భారత్, బంగ్లాదేశ్, కంబోడియా, నేపాల్ దేశాల్లో పనిచేసే 90 శాతం మంది కార్మికులు ఇబ్బందిపడుతున్నారని తెలిపిన రిపోర్ట్... ఇదే సమాచార లోపంతో రియల్ రంగం, హోల్ సేల్ అడ్ రీటెయిల్ ట్రేడ్, ఆహార సేవారంగంలో పనిచేసే వారు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. భారత్లో పని చేస్తున్న కార్మికులు సమాచారలోపంతో అన్ని రంగాల్లో నష్టపోతున్నారని అభిప్రాయపడింది.
సమాచారలోపంతోనే ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని రిపోర్ట్ వెల్లడించింది. స్వయం ఉపాధి, లేదా కుటుంబ వ్యాపారాలు, ఈ సమాచారలోపం కారణంగా ప్రమాద స్థాయిలో పడిపోయాయని చెప్పారు. ఇలాంటి పనులకు అలవాటు పడ్డవారు బయట ఉద్యోగాలు చేయలేరని రిపోర్ట్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 1.4 బిలియన్ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అందులో సింహభాగం ఒక్క భారత్లోనే ఉందని నివేదిక చెప్పింది. అంతేకాదు ఆసియా పసిఫిక్ దేశాల్లో పేదరిక నిర్మూలనకు చేస్తున్న కృషి కూడా రానున్న సంవత్సరాల్లో చిన్నగా తగ్గుతూ వస్తుందని...దీంతో పేదరికం ఆయా దేశాల్లో మళ్లీ తాండవిస్తుందని అభిప్రాయపడింది.