ఏటా లక్ష రోడ్డు ప్రమాదాలు .. ఐదేళ్లలో ఎంతమంది చనిపోయారో తెలుసా ..?
న్యూఢిల్లీ : దేశంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ సంస్థ చేసిన సర్వే వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏడాదికి కనీసం లక్షమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని వివరించింది. ఇది ఆందోళన కలిగించే అంశమని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. మోటారు వాహనల చట్టం 1988కి సవర్ణపై మంగళవారం పార్లమెంట్లో జరిగిన చర్చలో ప్రసంగించారు గడ్కరీ.
దేశంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అంగీకరించారు నితిన్ గడ్కరీ. ప్రపంచవ్యాప్తంగా చేస్తే ఇండియా రోడ్డు ప్రమాదాల్లో నెంబర్ వన్ అని పేర్కొన్నారు. మిగతా విషయాల్లో భారత్ నెంబర్ వన్ ఉండాలి గానీ .. రోడ్డు ప్రమాదాల్లో ఉండటం బాధ కలిగించిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సంస్థ చేసిన సర్వే వివరాలను లోక్సభకు తెలిపారు. 2017 నాటికి దేశంలో 4.7 లక్షల ప్రమాదాలు జరిగాయని వివరించారు. ఐదేళ్ల లెక్కిస్తే 5 లక్షల ప్రమాదాలు జరిగి ఉంటాయని తెలిపారు. ఏడాదికి లక్ష రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు 2013లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 1.37 లక్షలు కాగా .. అది 2017 నాటికి 1.48 లక్షలకు పెరిగిందని వివరించారు.
దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం మరింత కఠిన నిబంధనలు, నియమాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే రోడ్డు ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.