CAA Protest: యువకుడి పొట్టలో బుల్లెట్, రక్తం ధారగా,ఆస్పత్రికి వెళ్లడానికి తల్లిదండ్రులకు రాని ధైర్యం
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేస్తోన్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపిస్తోన్న కొందరు పోలీసుల తూటాలకు బలవుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఈద్గా వద్ద జరిగిన కాల్పుల్లో ఇప్పటికే ఇద్దరు చనిపోగా, మరో యువకుడి మృతి కలచివేస్తోంది. అయితే గాయాలతో ఇంటికొచ్చిన తమ కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయామని అతని పేరెంట్స్ చెప్తుండటం ప్రతీ ఒక్కరిని కలచివేస్తోంది.
పేరెంట్స్తో కలిసి
యూపీలోని కాన్పూర్లో మహ్మద్ రాయిస్ అనే (30) అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. మహ్మద్కు ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీలు కూడా ఉన్నారు. చిన్నవాడైన మహ్మద్.. తల్లిదండ్రులతో కలిసి ఉంటూ, వారిని చూసుకుంటున్నారు. అయితే గత శుక్రవారం కాన్పూర్లో సీఏఏకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలు వారి ఇంటి దీపాన్ని ఆర్పివేశాయి.
కాల్పుల్లో గాయపడి..
ఎప్పటిలాగే శుక్రవారం కూడా బేగమ్పుర్వా వద్ద గల కూరగాయలు విక్రయించే ఈద్గా మసీదు చౌరస్తా వద్దకు మహ్మద్ వెళ్లాడు. కానీ అక్కడ ఆందోళనలు పీక్కి చేరడం, పోలీసులు కాల్పులు జరపడంతో మహ్మద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. మహ్మద్ పొట్టలో బుల్లెట్ ఉందని.. అది రబ్బర్ బుల్లెట్ నిజమైనదో తెలియలేదు. మరోవైపు మహ్మద్ పొట్టలో తీవ్రగాయాలై.. రక్తం ఏరులై కారింది. ఆ రోజు రాత్రి ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 144 సెక్షన్ విధించడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీంతో మహ్మద్ను ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.
కేసుల భయం
చుట్టుపక్కల ఉన్నవారు కూడా మహ్మద్ను హాస్పిటల్ తీసుకెళ్లేందుకు ముందుకురాలేదు. ఒకవేళ ఆస్పత్రికి తీసుకెళ్తే తమపై ఎలాంటి కేసులు పెట్టి వేధిస్తారని భయపడ్డారు. గాయం పెద్దది అవడంతో రక్తం కారుతూనే ఉంది. దానికి చొక్కా కట్టిన ఆగలేదు. రాత్రంతా అలా రక్తం కారుతుండగా ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు.
ఆలస్యం..
మరునాడు వాహనంలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. రాత్రంతా రక్తం కారడం, గాయం తీవ్రత దృష్ట్యా మహ్మద్ చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. శుక్రవారం రాత్రే ఆస్పత్రికి తీసుకొస్తే బాగుండేదని వైద్యులు సూచించడంతో మహ్మద్ తల్లి కిస్మటూన్ నిషా, తండ్రి మహ్మద్ షరీఫ్ గుండెలవిసేలా రోదించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ధైర్యం చేసినా.. అల్లర్లకు మీరే కారణమని కొందరు స్థానికులు అనడంతో వెనకడుగు వేశామని చెప్పారు.
పోలీసులే దాడి చేశారు..
శుక్రవారం ఏం జరిగిందో తెలియదు. కానీ తన కుమారుడు మాత్రం పోలీసులే తనపై దాడి చేశారని తనతో చెప్పారని పేర్కొన్నారు. అతని శరీరంలో బుల్లెట్ దొరికిందని, అది రబ్బర్ బుల్లెట్ అని చెప్తున్నారని తెలిపారు. కానీ తమకు నిజమైన బుల్లెట్ ఏంటో తెలియదని పేర్కొన్నారు. శనివారం ఆస్పత్రికి తీసుకెళ్తే చికిత్స అందజేశారని.. కానీ ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. ఆదివారం తమ కుమారుడు మహ్మద్ చనిపోయాడని బోరున విలపిస్తూ తెలిపారు.
జీవానాధారం లేదు..
తమ ముగ్గురు కుమారులు విడిగా ఉంటున్నారని, తమతో ఉండే మహ్మద్ చనిపోవడంతో దిక్కులేకుండా పోయిందన్నారు. అతను సంపాదించిన దాంతో తమ పొట్ట నింపేవాడని, ఇప్పుడు తమ జీవానాధారం లేకుండా పోయిందని బోరున విలపిస్తున్నారు.
హెపటైటిస్ బీ అట..
మహ్మద్కు సంబంధించి పేరెంట్స్, బంధువుల వాదన ఇలా ఉంటే.. పోలీసుల వాదన మరోలా ఉంది. అతను హెపటైటిస్ బీ పేషంట్ అని చెప్తున్నారు. వ్యాధితో చనిపోయారని వైద్యులు తెలిపినట్టు పేర్కొన్నారు. అతని మృతదేహానికి నిరహించిన పోస్టుమార్టంతో ఆ అంశంపై స్పష్టత వస్తోందని చెప్పారు. కానీ పోలీసుల ఆరోపణలను మహ్మద్ తల్లిదండ్రులు తోసిపుచ్చారు.
పోలీసులపై పోరాడలేం..
తమకు తెలిసీ మహ్మద్కు హెపటైటిస్-బీ లేదని చెప్పారు. అంతేకాదు అతనికి ఏ రోగం లేదని బంధువు షరీఫ్ పేర్కొన్నారు. కాల్పులు జరిపి, చనిపోయేందుకు కారణమైన పోలీసులు.. ఘటనను కవర్ చేసేందుకు నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. తమ కుమారుడు మహ్మద్ చనిపోయాడని, ఇక రాడని.. పోలీసులపై తిరుగుబాటు చేసే స్థాయి తమది కాదని తన ధైన్యస్థితిని తండ్రి మహ్మద్ షరీఫ్ మీడియాకు తెలిపారు. కానీ మరొకరికి మాత్రం ఇలా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.