సీబీఐ నాగేశ్వరరావు సన్నిహితుడి కంపెనీపై కోల్కతా పోలీసుల దాడులు
కోల్కతా: సీబీఐ, బెంగాల్ ప్రభుత్వం మధ్య వార్ ఇంకా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. సీబీఐ మధ్యంతర మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడైన ప్రవీణ్ అగర్వాల్కు చెందిన ఫైనాన్స్ కంపెనీపై కోల్కతా పోలీసులు దాడులు నిర్వహించారు. నాగేశ్వరరావుకు సన్నిహితుడు కావడంతోనే అగర్వాల్ కంపెనీపై దాడులు జరిగినట్లు సమాచారం. అయితే నాగేశ్వరరావు మాత్రం దాడులకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తావా... సీబీఐ నాగేశ్వరరావుకు సుప్రీం చురకలు
ఓ సీనియర్ పోలీస్ ఉన్నతాధికారికి సంబంధించిన వారి కంపెనీపై పోలీసులు దాడులు నిర్వహించారని అందులో అక్రమాలు ఉన్నట్లు గుర్తించామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ త్రిపాఠి తెలిపారు. ఏంజెలా మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రవీణ్ అగర్వాల్కు చెందిన సంస్థగా గుర్తించడం జరిగిందని సీపీ స్పష్టం చేశారు. చట్టపరంగా ఆ కంపెనీని నమోదు చేయలేదని సీపీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ కంపెనీ పై బౌబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందడంతో సోదాలు నిర్వహించామని సీపీ త్రిపాఠీ చెప్పారు. ఈ కంపెనీ మరో అడ్రస్తో రిజిస్టర్ చేయడం జరిగిందని అది సాల్ట్ లేక్ అడ్రస్ అని చెప్పారు. ఇది పూర్తిగా నివాస ప్రాంతమని స్పష్టం చేశారు. 1994లో ఈ ప్రాంతంలో రిజిస్టర్ అయిన కంపెనీ అక్టోబర్ 2018 వరకు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించిందని చెప్పారు.
ఇక కంపెనీకి ..నాగేశ్వరరావు భార్య సంధ్యలకు మధ్య ఎన్నో ఆర్థికలావాదేవీలు జరిగాయని వెల్లడించిన నాగేశ్వరరావు ఎక్కడా కానీ చట్టవిరుద్ధంగా లావాదేవీలు జరిపిన దాఖలాలు లేవని చెప్పారు. ఇక రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ చట్టం ఇచ్చిన వివరాల ప్రకారం సంధ్య ఏంజెలా మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య ఆర్థికలావాదేవీలు జరిగాయి. ఆమె రూ.25 లక్షలు కంపెనీ నుంచి 2010-11, 2011-12, 2013-14 ఆర్థిక సంవత్సరాల్లో తీసుకున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. మరో వైపు సంధ్య తిరిగి కంపెనీకి రూ.1.14 కోట్లు రుణం ఇచ్చిందని రికార్డులు తెలిపాయి.అది కూడా మూడు ట్రాన్సాక్షన్స్ రూపంలో జరిగాయని స్పష్టం చేశాయి.
ఇక తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు నాగేశ్వరరావు. సంధ్య ఏంజెలా కంపెనీ నుంచి రూ. 25 లక్షలు అప్పుగా తీసుకున్నారని దీంతో ఏపీలోని గుంటూరులో ఇద్దరు కలిసి ఆస్తులు కొన్నట్లు వెల్లడించారు. 2011లో సంధ్య తనకు వారసత్వంగా సంక్రమించిన 11 నుంచి 17 ఎకరాల వ్యవసాయ భూమిని రూ. 58.62 లక్షలకు అమ్మి ఆ వచ్చిన డబ్బును ఏంజెలా మర్కంటైల్ కంపెనీకి బదిలీ చేసిందని పేర్కొన్నారు. అందులో అప్పుగా తీసుకున్న డబ్బులు వడ్డీ పోను మిగతా డబ్బులు రూ. 41 లక్షల 33 వేలు వడ్డీతో సహా తిరిగి ఇచ్చారని వివరించారు. అయితే ఆర్థిక లావాదేవీలు జరగకముందు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు.